...
...
Next Story

తెలంగాణలో సరికొత్త పర్యాటక పాలసీ.. సోమశిలలో భారీ ప్రాజెక్ట్.. గ్లోబల్ విలేజ్ ప్లాన్!

తెలంగాణ ప్రభుత్వం పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు భారీ ప్రణాళికలు చేస్తోంది. కొత్త పర్యాటక ప్రాంతాలను సృష్టించడం, సందర్శకులకు సౌకర్యాలను మెరుగుపరచడం, ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడంపై దృష్టి సారించి కొత్త టూరిజం డెవలప్‌మెంట్ ప్లాన్‌ను సిద్ధం చేస్తోంది.

Updated on: Jul 12, 2026 10:04 PM IST
Advertisement

తెలంగాణ రాష్ట్రాన్ని దేశీయ, అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం సరికొత్త పర్యాటక అభివృద్ధి ప్రణాళికను సిద్ధం చేస్తోంది. కొత్త పర్యాటక ప్రాంతాల గుర్తింపు, సందర్శకులకు అంతర్జాతీయ స్థాయి వసతుల కల్పన, ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ సరికొత్త వ్యూహాన్ని రచిస్తోంది.

తెలంగాణ ప్రభుత్వం సరికొత్త టూరిజం ప్లాన్
తెలంగాణ ప్రభుత్వం సరికొత్త టూరిజం ప్లాన్

తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు, రుచులు, హస్తకళలు, జానపద కళలు, అద్భుతమైన వారసత్వాన్ని ప్రపంచానికి చాటిచెప్పేందుకు గ్రాండ్ టూరిజం కార్నివాల్ నిర్వహించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. దుబాయ్‌లోని ప్రసిద్ధ 'గ్లోబల్ విలేజ్' స్ఫూర్తితో ఈ కార్నివాల్‌ను ప్రతి ఏటా ఒక మహా ఈవెంట్‌లా నిర్వహించి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులను ఆకర్షించాలని ప్రణాళికలు వేస్తోంది.

భాగ్యనగరానికి వచ్చే పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు నైట్ టూరిజం, హెరిటేజ్ టూరిజంపై ప్రత్యేక దృష్టి సారించారు. పుట్లిబౌలి, కోఠి, చార్మినార్, లాడ్ బజార్ ప్రాంతాలలో హెరిటేజ్ వాక్స్ నిర్వహిస్తారు. నైట్ బజార్లు, అత్యాధునిక సౌండ్ అండ్ లైట్ షోలను ఏర్పాటు చేస్తారు. నగరంలోని చారిత్రాత్మక మెట్ల బావుల విశిష్టతను చాటేలా ఫెస్టివల్‌ను నిర్వహిస్తారు. ప్రత్యేక సిటీ టూర్ బస్సులు, వింటేజ్ కార్ల మ్యూజియం ఏర్పాటు చేయనున్నారు.

పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా అమ్రాబాద్, కవాల్ టైగర్ రిజర్వ్ అడవుల్లో ఎకో టూరిజంను భారీగా విస్తరించనున్నారు. కర్ణాటకలోని ప్రసిద్ధ బండీపూర్ వన్యప్రాణి పర్యాటక నమూనాను అధికారులు అధ్యయనం చేయనున్నారు. చెంచు గిరిజనుల సంస్కృతి, కాకతీయుల వారసత్వ ప్రాంతాలు, ట్రెకింగ్ వంటి వాటిని ఈ ఎకో టూరిజంలో భాగం చేయనున్నారు.

యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడమైన రామప్ప దేవాలయం వద్ద పర్యాటక కేఫెటేరియాను పునరుద్ధరించనున్నారు. అలాగే హైదరాబాద్‌లోని సంజీవయ్య పార్క్‌లో సరికొత్త వినోద కార్యక్రమాలను ప్రవేశపెట్టనున్నారు. పర్యాటకులకు సరైన సమాచారం అందించేందుకు వీలుగా టూర్ గైడ్‌ల కోసం ప్రత్యేక శిక్షణ, సర్టిఫికేషన్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించనున్నారు.

పర్యాటక రంగాన్ని మరింత పటిష్టం చేసేందుకు ప్రభుత్వ ఆస్తుల రక్షణ, పర్యాటక ప్రాంతాల సముచిత నిర్వహణ, క్షేత్రస్థాయిలో ప్రాజెక్టుల పనులను వేగవంతం చేసేందుకు పర్యవేక్షణను మరింత కఠినతరం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe