రాష్ట్రంలోని మున్సిపల్ ఎన్నికల సందడి మొదలైంది. నేటి నుంచి నామినేషన్లను స్వీకరిస్తున్నారు. దీంతో ఆసక్తి గల అభ్యర్థులు…కార్యాలయాలకు క్యూ కడుతున్నారు. ఈనెల 30 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.

మరోవైపు ఫిబ్రవరి 3 వరకు ఉపసంహరణకు గడువు ఇచ్చారు. ఫిబ్రవరి 11న పోలింగ్ నిర్వహిస్తారు. ఫిబ్రవరి 13న ఫలితాలు వెల్లడించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.
పోలీసులు భారీ బందోబస్తు మధ్య నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నామినేషన్లు వేసే అభ్యర్థులు అర్హతలతో పాటు సంబంధిత పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి… స్వీకరిస్తున్నారు.
- నామినేషన్ల ప్రారంభం-28.01.2026(ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5:00 వరకు).
- నామినేషన్ల ముగింపు తేదీ-30.01.2026(సాయంత్రం 5:00 గంటల వరకు).
- పోలింగ్ తేదీ-11.02.2026 (ఉదయం 7:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు).
- ఓట్ల లెక్కింపు-13.02.2026 (ఉదయం 8:00 గంటల నుంచి ఉంటుంది. లెక్కింపు పూర్తయిన తర్వాత ఫలితాలు వెల్లడిస్తారు).
అభ్యర్థి వద్ద ఉండాల్సి పత్రాలు:
- నామినేషన్ ఫారమ్
- అఫిడవిట్
- జనన ధ్రువీకరణ పత్రం
- ఓటర్ జాబితాలో పేరున్న సర్టిఫికెట్
- ఇటీవలే తీసుకున్న కుల ధ్రువీకరణ పత్రం (ఎస్సీ ,ఎస్టీ ,బీసీలకు మాత్రమే)
- బ్యాంక్ ఖాతా
- పాస్ పోర్టులు
- ఆధార్ కార్డు
- రాజకీయ పార్టీల తరఫున పోటీ చేసే వారు బీ-ఫామ్ తీసుకొని రిటర్నింగ్ అధికారికి ఇవ్వాలి.
- స్వతంత్ర అభ్యర్థులకు ఆ వార్డులోని 10 మంది ఓటర్ల ప్రతిపాదన తప్పనిసరి.
- మున్సిపాలిటీ నుంచి బకాయి లేనట్టు రశీదు సమర్పించాల్సి ఉంటుంది.
- మున్సిపాలిటీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రూ.1,250, ఇతరులకు రూ.2,500 డిపాజిట్ రుసుంగా నిర్ణయించారు.
- కార్పొరేషన్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రూ.2,500, ఇతరులకు రూ.5,000 డిపాజిట్ చెల్లించాలి.
- ఇతర పత్రాలు
ఆస్తి పన్ను బకాయిలు చెల్లిస్తేనే నామినేషన్ వేయడానికి అవకాశం ఉంటుంది. పెండింగ్ ఉంటే నామినేషన్లను స్వీకరించరు. ఈ పన్ను చెల్లింపు ప్రక్రియలో నిర్లక్ష్యం వహించకుండా క్లియర్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.