...
...
Next Story

TG Abhaya Hastham Scheme : సివిల్స్ అభ్యర్థులకు రూ. లక్ష సాయం - ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం!

TG Rajiv Gandhi Civils Abhaya Hastham Scheme : యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తెలంగాణ అభ్యర్థులకు సింగరేణి సంస్థ 'రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం' పథకం కింద లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించనుంది. అర్హులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Published on: Jul 12, 2026, 07:40:54 IST
Advertisement

TG Rajiv Gandhi Civils Abhaya Hastham Scheme : తెలంగాణ రాష్ట్రానికి చెందిన సివిల్ సర్వీసెస్ అభ్యర్థులకు సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) తీపి కబురు అందించింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ ఏడాది కూడా 'రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం' పథకాన్ని కొనసాగిస్తున్నట్లు సింగరేణి సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (CMD) డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ పథకం కింద యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించి, మెయిన్స్ పరీక్షకు ఎంపికైన తెలంగాణ అభ్యర్థులకు లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నారు.

రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం స్కీమ్
రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం స్కీమ్

ఈ ఆర్థిక సాయం కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత, అర్హత సాధించిన ప్రతి ఒక్కరికీ లక్ష రూపాయల చొప్పున నేరుగా సాయం అందిస్తారు. ఈ పథకానికి సంబంధించిన పూర్తి నిబంధనలు, దరఖాస్తు విధానం వివరాల కోసం అభ్యర్థులు సింగరేణి అధికారిక వెబ్‌సైట్ www.scclmines.com ని సందర్శించవచ్చు.

తెలంగాణ ప్రాంతానికి చెందిన యువత సింగరేణి అందిస్తున్న ఈ ఆర్థిక సాయాన్ని సద్వినియోగం చేసుకుని, సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో విజయకేతనం ఎగరేయాలని డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి ఆకాంక్షించారు. ఉన్నతమైన సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలను సాధించడం ద్వారా రాష్ట్రానికి, దేశానికి సేవ చేసే అవకాశాన్ని యువత అందుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

స్కీమ్ నేపథ్యం ఇదే…..

తెలంగాణ నుంచి సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలకు ఎంపికయ్యే వారి సంఖ్యను మరింత పెంచాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సింగరేణి సంస్థ తన కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) నిధులలో భాగంగా ఈ 'రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం' పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించింది. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి ఆదేశాల మేరకు….. 2024 లో ఈ పథకానికి శ్రీకారం చుట్టినట్లు సీఎం‌డీ గుర్తుచేశారు.

ఇక గతేడాది జరిగిన పరీక్షల్లో ఈ పథకం కింద 206 మంది అభ్యర్థులు ఆర్థిక సాయం అందుకున్నారు. వీరిలో 50 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూ దశకు చేరుకోగా, అందులో నుంచి 20 మంది అభ్యర్థులు సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలకు తుది ఎంపికయ్యారు.

సరిగ్గా చదువుకోవడానికి ఆర్థిక ఇబ్బందులు అడ్డంకి కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం…. ఎంతోమంది పేద, మధ్యతరగతి అభ్యర్థులకు వరంగా మారింది. ఈ ఏడాది కూడా ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన అభ్యర్థులు ఆలస్యం చేయకుండా అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe