Singareni Cath Lab : సింగరేణి కార్మికులకు ఆరోగ్య భరోసా - గోదావరిఖనిలో అత్యాధునిక క్యాథ్ ల్యాబ్.. ప్రత్యేకతలివే

Singareni Cath Lab Godavarikhani : రామగుండం-1 ఏరియా ఆసుపత్రిలో అత్యాధునిక కార్డియాక్ క్యాథ్ ల్యాబ్‌ను సింగరేణి సంస్థ ఏర్పాటు చేసింది. దీని ద్వారా బొగ్గు గని కార్మికులకు, వారి కుటుంబాలకు స్థానికంగానే అత్యవసర గుండె చికిత్సలు అందనున్నాయి.

Published on: Jun 30, 2026, 07:52:30 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Singareni Cath Lab Godavarikhani : దేశ ఇంధన అవసరాలను తీరుస్తూ అహర్నిశలు శ్రమిస్తున్న బొగ్గు గని కార్మికుల ఆరోగ్య రక్షణే పరమావధిగా సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) మరో బృహత్తర అడుగు వేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు…… కేవలం ఏడాది కాలంలోనే రామగుండం-1 ఏరియా ఆసుపత్రి ప్రాంగణంలో అత్యాధునిక గుండె వైద్య విభాగాన్ని (కార్డియాక్ క్యాథెటరైజేషన్ ల్యాబొరేటరీ - క్యాథ్ ల్యాబ్) ఏర్పాటు చేసింది. ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న ఈ అత్యాధునిక ల్యాబ్, సింగరేణి చరిత్రలోనే తొలి కావడం విశేషం. ఏటా సుమారు రూ.6 కోట్ల నిర్వహణ వ్యయంతో నడవనున్న ఈ ల్యాబ్ ద్వారా బొగ్గు బెల్ట్ పరిధిలోని వేలాది మంది ప్రాణాలు నిలవనున్నాయి.

గోదావరిఖనిలో అత్యాధునిక క్యాథ్ ల్యాబ్
గోదావరిఖనిలో అత్యాధునిక క్యాథ్ ల్యాబ్

ఈ ల్యాబ్‌ను కార్మికులు అత్యధికంగా నివసించే గోదావరిఖని (సుమారు 33 వేల మంది కార్మికులు) కేంద్రంగా ఏర్పాటు చేశారు. దీని వల్ల సింగరేణి ప్రస్తుత ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, రిటైర్డ్ ఉద్యోగులతో పాటు పెద్దపల్లి, మంచిర్యాల, కొమరం భీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల ప్రజలకు కార్పొరేట్ స్థాయి సూపర్ స్పెషాలిటీ వైద్యం అందుబాటులోకి రానుంది.

క్యాథ్ ల్యాబ్ ఆవశ్యకత ఏమిటి?

ప్రస్తుత కాలంలో వయసుతో నిమిత్తం లేకుండా గుండె జబ్బులు ప్రాణాంతకంగా మారుతున్నాయి. గుండెపోటు ఎప్పుడు వస్తుందో ఊహించడం కష్టం. అయితే, గుండెపోటు వచ్చిన మొదటి గంట సమయాన్ని వైద్య పరిభాషలో "గోల్డెన్ అవర్" (రక్షణ సమయం) అంటారు. ఈ సమయంలో అందించే తక్షణ వైద్యం రోగి ప్రాణాలను కాపాడటంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది.

సింగరేణి సంస్థకు వివిధ ఏరియాల్లో సుసజ్జితమైన ఆసుపత్రులు ఉన్నప్పటికీ, ఇంతకాలం అధునాతన కార్డియాక్ కేర్ (గుండె వైద్యం) సదుపాయాలు అందుబాటులో లేవు. ఫలితంగా, గుండెపోటుకు గురైన బాధితులను హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ వంటి సుదూర నగరాలకు తరలించాల్సి వచ్చేది. ఈ ప్రయాణంలో విలువైన 'గోల్డెన్ అవర్' సమయం వృథా అయి ఎందరో ప్రాణాలు కోల్పోయారు. ఈ క్లిష్టమైన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ, తక్షణ ప్రాణరక్షణే ధ్యేయంగా సింగరేణి యాజమాన్యం గోదావరిఖనిలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన క్యాథ్ ల్యాబ్‌ను నిర్మించింది. దీనివల్ల ఆంజియోగ్రామ్, ఆంజియోప్లాస్టీ వంటి అత్యవసర చికిత్సలు ఇకపై స్థానికంగానే తక్షణమే అందుతాయి.

సింగరేణి సంస్థ ఏటా తన ఉద్యోగుల వైద్య సేవల కోసం రూ.300 కోట్లకు పైగా ఖర్చు చేస్తోంది. ఇందులో సింహభాగం కార్పొరేట్ ఆసుపత్రుల రిఫరల్స్ కోసమే వెచ్చిస్తోంది. గత ఏడాది కాలంలోనే భూపాలపల్లి, బెల్లంపల్లి, రామగుండం, రామకృష్ణాపూర్ తదితర ప్రాంతాల నుంచి గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న సుమారు 3,000 మంది కార్మికులు మరియు వారి కుటుంబ సభ్యులను హైదరాబాద్‌లోని కార్పొరేట్ ఆసుపత్రులకు రిఫర్ చేయాల్సి వచ్చింది.

అత్యవసర గుండె చికిత్సల్లో ప్రతి నిమిషం ఎంతో విలువైనదని గుర్తించిన సింగరేణి యాజమాన్యం.. కేవలం రిఫరల్స్ కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేయడం కంటే, స్థానికంగానే అధునాతన చికిత్సను అందుబాటులోకి తేవడం మిన్న అని భావించింది. కార్మికుల సంక్షేమమే తమ ప్రథమ ప్రాధాన్యతని నిరూపిస్తూ, దేశంలోని ఇతర ప్రభుత్వ రంగ సంస్థలకు ఆదర్శంగా నిలిచేలా ఈ నిర్ణయం తీసుకుంది.

గోదావరిఖనిలోని రామగుండం-1 ఏరియా ఆసుపత్రి ప్రాంగణంలో సుమారు 7,890 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ సింగరేణి కార్డియాలజీ విభాగం రూపుదిద్దుకుంది. ఇందులో ఏర్పాటు చేసిన సౌకర్యాలు ఇలా ఉన్నాయి:

  • 5 పడకల ఇంటెన్సివ్ కార్డియాక్ కేర్ యూనిట్ (ICCU)
  • 10 పడకల ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU)
  • ప్రత్యేక కన్సల్టేషన్ గదులతో కూడిన అవుట్ పేషెంట్ (OP) బ్లాక్

ఈ ల్యాబ్‌ను పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ (PPP) నమూనాలో ఏర్పాటు చేశారు. దీని కోసం సింగరేణి సంస్థ ఏడేళ్ల కాలంలో దాదాపు రూ.50 కోట్ల వరకు ఖర్చు చేయనుంది. ఈ ల్యాబ్ ద్వారా కేవలం సింగరేణి కార్మికులకే కాకుండా, స్థానిక సాధారణ ప్రజలకు కూడా కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (CGHS) ధరల ప్రకారం అత్యంత తక్కువ ఖర్చుతో అధునాతన గుండె వైద్య సేవలు అందుతాయి.

నెలకు సుమారు 3,000 మందికి పైగా రోగులు ఈ సేవల ద్వారా లబ్ధి పొందుతారని అంచనా వేస్తున్నారు. ఈ విభాగంలో ఉన్న మొత్తం పడకలలో 50 శాతం పడకలను సింగరేణి ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, విశ్రాంత ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా కేటాయించారు.

క్యాథ్ ల్యాబ్‌లో అందుబాటులో ఉండే సేవలు:

  • కొరోనరీ యాంజియోగ్రఫీ : గుండె ధమనులలో ఉన్న బ్లాకులను గుర్తించే అత్యాధునిక ఇమేజింగ్ పరీక్ష.
  • యాంజియోగ్రామ్ అండ్ యాంజియోప్లాస్టీ : గుండెపోటు వచ్చిన సమయంలో రక్తప్రసరణను పునరుద్ధరించే అత్యవసర చికిత్సలు.
  • కొరోనరీ స్టెంటింగ్ : బ్లాక్ అయిన ధమనులను తెరిచేందుకు చేసే ప్రాణరక్షణ స్టెంట్ ఇంప్లాంటేషన్ ప్రక్రియ.
  • ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ సేవలు : అనుభవజ్ఞులైన కార్డియాలజిస్టులు, ప్రత్యేక శిక్షణ పొందిన వైద్య సిబ్బంది పర్యవేక్షణలో సమగ్ర చికిత్స.

ఈ సందర్భంగా సింగరేణి చీఫ్ మెడికల్ ఆఫీసర్ కిరణ్ రాజ్ కుమార్ మాట్లాడుతూ.. సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని స్థానికంగానే అందుబాటులోకి తేవాలనే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగానే ఈ క్యాథ్ ల్యాబ్‌ను నిర్మించినట్లు తెలిపారు. గోదావరిఖని క్యాథ్ ల్యాబ్ 'గోల్డెన్ అవర్' లోనే అత్యవసర చికిత్స అందించి ప్రాణాలు నిలిపే సంజీవనిగా మారుతుందని…. ఇకపై రోగులను సుదూర నగరాలకు తరలించాల్సిన అవసరం ఉండదని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More