Hyderabad Twin Reservoirs : జంట జలాశయాలకు వరద ప్రవాహం - దిగువ ప్రాంతాలకు హెచ్చరికలు
Twin Reservoirs Flood Alert : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ తాగునీటి వనరులైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలకు వరద ప్రవాహం ప్రారంభమైంది. దీంతో జలమండలి అధికారులు, దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు.
హైదరాబాద్ నగర శివార్లలోని జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్ (గండిపేట), హిమాయత్ సాగర్లకు వరద ముప్పు పొంచివుంది. గత కొన్ని రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈ రెండు జలాశయాలకు వరద ప్రవాహాలు మొదలయ్యాయి. ఇన్ ఫ్లో క్రమక్రమంగా పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ జలమండలి ఆదివారం ప్రకటన విడుదల చేసింది.

జంట జలాశయాల్లోకి వస్తున్న వరద నీటి పరిమాణాన్ని, ప్రస్తుత నీటి మట్టాలను జలమండలికి చెందిన ప్రత్యేక సాంకేతిక బృందాలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. జలాశయాల భద్రతను దృష్టిలో ఉంచుకుని, పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ గేట్లు ఎత్తేందుకు మరియు నీటిని మూసీ నదిలోకి విడుదల చేయడానికి అధికారులు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నారు. వరద తీవ్రత మరింత పెరిగితే ముందస్తు చర్యల కోసం జీహెచ్ఎంసీ, రెవెన్యూ, విపత్తు నిర్వహణ విభాగాలు (DRF), స్థానిక సంస్థలు పరస్పర సమన్వయంతో అప్రమత్తంగా పనిచేయాలని జలమండలి సూచించింది.
దిగువ ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు
జలాశయాల గండిపేట, హిమాయత్ సాగర్ దిగువ ప్రాంతాలలో…. ముఖ్యంగా మూసీ నదీ పరివాహక ప్రాంతాల వెంట నివసించే ప్రజలు ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. జలాశయాల క్రస్ట్ గేట్ల నిర్వహణ, నీటి విడుదల లేదా ఇతర అత్యవసర నిర్ణయాలపై ఎప్పటికప్పుడు అధికారిక ప్రకటనల ద్వారా సమాచారం అందజేస్తామని జలమండలి స్పష్టం చేసింది. ప్రజలు ఎలాంటి పుకార్లను నమ్మవద్దని కోరింది.
జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి జంట జలాశయాల వరద పరిస్థితిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. రెండు ప్రాజెక్టుల వద్ద పరిస్థితిని ఇంజినీరింగ్ అధికారులు నిరంతరం కనిపెట్టుకుని ఉండాలని ఆదేశించారు. “సంబంధిత అన్ని ప్రభుత్వ శాఖలు పరస్పర సమన్వయంతో అప్రమత్తంగా పనిచేయాలి. దిగువ ప్రాంతాల ప్రజలు అధికారుల సూచనలను ఖచ్చితంగా పాటిస్తూ వరద పరిస్థితిని గమనించాలి. అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి” అని ఎండీ అశోక్ రెడ్డి ప్రజలకు సూచించారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

