ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం - లొంగిపోవాలని ప్రభాకర్‌రావుకు సుప్రీంకోర్టు ఆదేశాలు

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఐపీఎస్‌ అధికారి ప్రభాకర్‌రావుకు సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం... శుక్రవారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్‌ పీఎస్‌లో సిట్‌ అధికారి ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది.

Published on: Dec 11, 2025 4:27 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్ రావుకు గట్టి షాక్ తగిలింది. శుక్రవారం ఉదయం 11 గంటలలోపు పోలీసుల ఎదుట లొంగిపోవాలని సుప్రీంకోర్టు గురువారం ఆదేశించింది.

సుప్రీం కోర్టు
సుప్రీం కోర్టు

జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆర్ మహదేవన్ లతో కూడిన ధర్మాసనం… ప్రభాకర్ రావు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారించింది. ఈ సందర్భంగా లొంగిపోవాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

రేపు లొంగిపోండి - సుప్రీంకోర్టు ఆదేశాలు

"రేపు ఉదయం 11.00 గంటలలోపు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ మరియు దర్యాప్తు అధికారి (సిట్) ముందు లొంగిపోవాలని పిటిషనర్ ను ఆదేశిస్తున్నాం. చట్టానికి అనుగుణంగా కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయాలి. పిటిషనర్ తన ఇంటి నుంచి ఆహారంతో పాటు క్రమం తప్పకుండా మందులు తీసుకోవచ్చ "అని ధర్మాసనం తెలిపింది.

విచారణ సందర్భంగా రాష్ట్రం తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. తెరిచిన ఐక్లౌడ్ ఖాతాలలో ఎటువంటి డేటా లేదని… ఈమెయిల్ చిరునామాలు తెరవలేదని పేర్కొన్నారు. ఉత్తర్వులు ఉన్నప్పటికీ ప్రభాకర్ రావు తన ఐక్లౌడ్ ఖాతాలను నిలిపివేస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో పలువురు రాజకీయ నేతలు, ప్రముఖులు, ఆఖరికి జడ్జిల ఫోన్లు కూడా ట్యాపింగ్‌కు గురయ్యాయని అభియోగాలున్నాయి. ఆ ఆధారాలను మాయం చేసే ప్రయత్నమూ జరిగిందనే ఆరోపణలూ ఉన్నాయి. ఈ క్రమంలో ప్రభాకర్‌ రావు బంధువు, ఇంటెలిజెన్స్‌లో డీఎస్పీగా పని చేసిన ప్రణీత్‌రావు అరెస్ట్‌తో ట్యాపింగ్‌ కేసు వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత విచారణలో భాగంగా… ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు పేరును ఏ1గా చేర్చింది. ఆయన చాలాకాలంగా అమెరికాలో ఉండగా… ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) పలు ప్రయత్నాలు చేసి స్వదేశానికి రప్పించింది.

సుప్రీంకోర్టు నుంచి మధ్యంతర ఆదేశాలతో అరెస్ట్‌ నుంచి ఊరట పొందిన ప్రభాకర్ రావు…. కొన్ని రోజుల తర్వాత హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. అప్పట్నుంచి పలుమార్లు ఆయన్ని సిట్‌ విచారణ జరిపింది. అయితే అరెస్ట్ నుంచి ఊరట కావాలంటే దర్యాప్తునకు అన్నివిధాలా సహకరించాలని ప్రభాకర్‌రావుకు సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అయినా కూడా ఆయన ఐక్లౌడ్‌ అకౌంట్‌ పాస్‌వర్డ్‌ ఇవ్వకుండా డేటాను డిలీట్‌ చేశారని.. దర్యాప్తులో ఏరకంగానూ సహకరించడం లేదని సిట్‌ తరఫున తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది.

తాత్కాలిక రక్షణను పక్కన పెట్టి లొంగిపోయి విచారణకు సహకరించాలని ఇప్పుడు అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. దీంతో ఈ కేసులో ఏ1గా ఉన్న ప్రభాకర్ రావు… రేపు పోలీసుల ఎదుట లొంగిపోనున్నారు.