లైంగిక దాడి ఆరోపణలు... బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు..! తెరపైకి హనీ ట్రాప్
Bandi Sanjay son Bhageerath Case : కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్పై హైదరాబాద్లోని పెట్బషీరాబాద్ పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. 17 ఏళ్ల మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో ఈ కేసు బుక్ అయింది. మరోవైపు భగీరథ్ కూడా కరీంనగర్లో ఫిర్యాదు చేశాడు.
తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్పై లైంగిక దాడి ఆరోపణలు రావడంతో పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. పెట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కేసు నమోదైంది.
తండ్రి బండి సంజయ్ తో భగీరథ్(ఫైల్ ఫొటో)
ఆరోపణలు ఏంటి..?
ఫిర్యాదు చేసిన 17 ఏళ్ల మైనర్ బాలిక కథనం ప్రకారం.. గతేడాది డిసెంబర్ 31వ తేదీన మొయినాబాద్లోని ఒక ఫామ్హౌస్లో భగీరథ్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలు 10వ తరగతి మధ్యలోనే ఆపేసిన విద్యార్థినిగా గుర్తించారు. ఆమె కుటుంబ సభ్యులు పెట్బషీరాబాద్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో, బాలిక వయస్సును ధృువీకరించుకున్న పోలీసులు… పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు బుక్ చేశారు.
కరీంనగర్లో 'హనీ ట్రాప్' ఫిర్యాదు
మరోవైపు ఈ కేసులో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. ఈ పోక్సో కేసు నమోదు కావడానికి ఒక రోజు ముందే బండి భగీరథ్ కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో సదరు బాలిక కుటుంబంపై ఫిర్యాదు చేశారు. తనను స్నేహం పేరుతో ట్రాప్ చేసి…. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చారని పేర్కొన్నాడు. తాను నిరాకరించడంతో రూ. 5 కోట్లు ఇవ్వాలని బ్లాక్మెయిల్ చేస్తున్నారని తన ఫిర్యాదులో ప్రస్తావించాడు.
స్నేహితుల ద్వారా పరిచయమైన ఆ యువతి తనను ఫ్యామిలీ ఫంక్షన్లకు, దేవాలయాలకు ఆహ్వానించిందని…. అంతా పథకం ప్రకారమే జరిగిందని ఆయన ఆరోపించారు. ఆమె తండ్రికి రూ. 50,000 చెల్లించానని ఫిర్యాదులో వివరించారు.
ప్రస్తుతానికి పోలీసులు రెండు ఫిర్యాదులను వేర్వేరుగా దర్యాప్తు చేస్తున్నారు. పెట్బషీరాబాద్ పోలీసులు లైంగిక దాడి ఆరోపణలపై విచారణ జరుపుతున్నారు. ఇదే సమయంలో కరీంనగర్ టూ టౌన్ పోలీసులు కూడా రంగంలోకి దిగారు.
బ్లాక్మెయిల్ ఆరోపణలు ఎంతవరకు నిజం…? లైంగిక దాడి జరిగిందా లేదా…? అన్న అంశాలపై పోలీసులు శాస్త్రీయ ఆధారాలను సేకరిస్తున్నారు. బండి సంజయ్… ప్రస్తుతం కేంద్రమంత్రి కావటమే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్య నేతగా ఉన్నారు. దీంతో ఈ కేసు రాజకీయంగా కూడా పెను దుమారం రేపుతోంది.
గతంలో మహీంద్రా యూనివర్సిటీలో తోటి విద్యార్థిపై దాడి చేసిన ఘటనలో కూడా భగీరథ్ వివాదాల్లో నిలిచారు. ఇప్పుడు తాజాగా హనీ ట్రాప్ మరియు మైనర్ బాలిక వేధింపుల ఆరోపణలు ఒకేసారి రావడంతో మరోసారి వార్తల్లోకి ఎక్కారు. పోలీసులు రెండు వైపుల ఫిర్యాదులపై లోతైన దర్యాప్తు జరుపుతుండగా.. ఎలాంటి నిజాలు బయటికి వస్తాయనేది ఉత్కంఠగా మారింది..!
హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More