హైదరాబాద్‌లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అగ్నిప్రమాదం.. సురక్షితంగా బయటపడ్డ 20 మంది ప్రయాణికులు!

హైదరాబాద్ కేపీహెచ్‌బీలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రవైట్ ట్రావెల్స్ బస్సులో అగ్ని ప్రమాదం జరిగింది. బస్సులోని సుమారు 20 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.

Published on: Apr 18, 2026, 05:25:08 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ వద్ద ఒక ప్రైవేట్ ఏసీ స్లీపర్ బస్సులో అర్ధరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. బస్సు సిబ్బంది సత్వర స్పందనతో మంటలు వాహనాన్ని పూర్తిగా ఆక్రమించక ముందే బస్సులోని సుమారు 20 మంది ప్రయాణికులను సురక్షితంగా బయటకు తరలించారు.

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధం
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధం

శుక్రవారం రాత్రి కేపీహెచ్‌బీలో ప్రైవేట్ ట్రావెల్ బస్సులో భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సిబ్బంది మంటలు వ్యాపించకముందే ప్రయాణికులను కిందకు దించడంతో పెద్ద పెను ప్రమాదాన్ని నివారించారు.

స్థానిక నివాసితులు, పోలీసుల కథనం ప్రకారం శ్రీ దుర్గా మహేశ్వరి ట్రావెల్స్‌కు చెందిన ఏసీ స్లీపర్ బస్సు మియాపూర్ నుండి బయలుదేరింది. ఆంధ్రప్రదేశ్‌లోని పాలకొల్లు వెళ్లే మార్గమధ్యంలో ఎస్ఆర్ నగర్ వైపు వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది.

రాత్రి సుమారు 11 గంటల సమయంలో బస్సు కేపీహెచ్‌బీలోని పద్మావతి ప్లాజా బస్ స్టాప్ సమీపానికి చేరుకున్నప్పుడు, డ్రైవర్ క్యాబిన్‌లో మొదట మంటలు కనిపించాయి. బస్సు సిబ్బంది వేగంగా స్పందించి ప్రయాణీకులందరినీ సురక్షిత కిందకు దించారు. నిమిషాల వ్యవధిలోనే మంటలు వాహనం మొత్తాన్ని చుట్టుముట్టాయి.

సమాచారం అందుకున్న వెంటనే, కూకట్‌పల్లి ట్రాఫిక్ సీఐ జనయ్య, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను తక్షణమే అదుపులోకి తీసుకువచ్చారు. ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు జరగలేదు. అయితే, ఈ ఘటన కారణంగా ఆ ప్రాంతంలో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అగ్నిప్రమాదానికి గల కచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు.

ఇటీవల స్లీపర్ బస్సుల్లో ప్రమాదాలు ఎక్కువ అయ్యాయి. చాలా బస్సులు కంపెనీల నుండి నేరుగా కొన్నవి కాకుండా, బయట బాడీ బిల్డింగ్ యూనిట్లలో మార్పులు చేసినవి ఉంటున్నాయి. బస్సు లోపల నడవడానికి ఉండే దారి చాలా ఇరుకైనదిగా ఉండటం వల్ల ప్రమాదం జరిగినప్పుడు ప్రజలు త్వరగా బయటకు రాలేకపోతున్నారు.

ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ సీట్లతో మూసుకుపోవడం లేదా అవి సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ప్రాణనష్టం పెరుగుతోంది. డీజిల్ పైపుల్లో లీకేజీలు ఉన్నా లేదా ఇంజిన్ ఆయిల్ వేడెక్కినా మంటలు వచ్చే అవకాశం ఉంది. చాలా సేపు ఏకధాటిగా ప్రయాణించడం వల్ల టైర్లలో వేడి పెరిగి, అవి పేలినప్పుడు వచ్చే నిప్పు రవ్వలు బస్సుకు అంటుకోవచ్చు.

ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు బస్సు లోపల ప్రయాణికులను ఆకర్షించడానికి అదనపు వసతులు కల్పిస్తుంటారు. టీవీలు, మ్యూజిక్ సిస్టమ్‌లు, ప్రతి బర్త్ దగ్గర మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు, ఇన్వర్టర్లను అమర్చడం వల్ల బ్యాటరీపై లోడ్ పెరుగుతుంది.

తక్కువ నాణ్యత గల వైర్లను వాడటం లేదా సరైన ఇన్సులేషన్ లేకపోవడం వల్ల వేడి పుట్టి షార్ట్ సర్క్యూట్‌లు జరుగుతున్నాయి. ఎలక్ట్రానిక్ వస్తువులు, లేదా త్వరగా మండే వస్తువులను తరలించడం వల్ల అగ్నిప్రమాదం జరిగినప్పుడు మంటలు క్షణాల్లో వ్యాపిస్తున్నాయి.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More