తెలుగు ప్రయాణికులకు శుభవార్త... కాచిగూడ - మురుడేశ్వర్ ట్రైన్ 'కుంట' వరకు పొడిగింపు! పూర్తి వివరాలు
Kachiguda Murdeshwar Express Train : హైదరాబాద్ కాచిగూడ నుంచి కర్ణాటకలోని మురుడేశ్వర్ వరకు నడిచే వీక్లీ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలును కుంట వరకు పొడిగించారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. జూన్ 19 నుంచి ఈ మార్పులు అమల్లోకి వచ్చాయి.
Kachiguda Murdeshwar Express : హైదరాబాద్ నుంచి కర్ణాటక వైపు ప్రయాణించే రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే తీపి కబురు అందించింది. ప్రయాణికుల డిమాండ్, సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని కాచిగూడ నుంచి మురదేశ్వర్ వరకు నడుస్తున్న వీక్లీ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు సర్వీసును మరింత ముందుకు పొడిగించారు. ఈ రైలును కర్ణాటకలోని కుంట వరకు పొడిగిస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. పర్యాటకులు, వ్యాపార వేత్తలకు ఎంతో ఉపయోగపడే ఈ పొడిగింపు నిర్ణయం తక్షణమే అమల్లోకి రానుంది.

దక్షిణ మధ్య రైల్వే వివరాల ప్రకారం….. ఈ పొడిగించిన రైలు సర్వీసు జూన్ 19, శుక్రవారం నుంచే ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ రైలు ప్రయాణ వేగం, కేటగిరీకి సంబంధించి రైల్వే అధికారులు ఒక కీలక స్పష్టత ఇచ్చారు. రైలు నంబర్లు 12789/12790 కలిగిన ఈ కాచిగూడ - మురుడేశ్వర్ ఎక్స్ప్రెస్, కాచిగూడ నుంచి మంగళూరు మధ్య యథావిధిగా సూపర్ఫాస్ట్ కేటగిరీలోనే నడుస్తుంది. కానీ…. మంగళూరు దాటిన తర్వాత అక్కడ నుంచి కుంట వరకు మాత్రం ఈ రైలు నాన్ సూపర్ఫాస్ట్ సర్వీసుగా ప్రయాణిస్తుంది.
టైమింగ్స్ వివరాలు….
రైలు నంబర్ 12789 ప్రతి వారం మంగళవారం, శుక్రవారాల్లో ఉదయం 6.05 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరుతుంది. ఇది మరుసటి రోజు మధ్యాహ్నం 2.40 గంటలకు కుంట స్టేషన్కు చేరుకుంటుంది. ఈ రైలు కుంట వెళ్లే మార్గంలో మధ్యాహ్నం 1.48 గంటలకు మురుడేశ్వర్ స్టేషన్ నుంచి బయలుదేరుతుంది.
తిరుగు ప్రయాణంలో…. రైలు నంబర్ 12790 ప్రతి బుధవారం, శనివారాల్లో మధ్యాహ్నం 3.25 గంటలకు కుంట నుంచి బయలుదేరుతుంది. ఈ రైలు ప్రయాణ మార్గంలో మురుడేశ్వర్ (సాయంత్రం 4.04), భత్కల్ (సాయంత్రం 4.20), మూకాంబికా రోడ్ బైందూర్ (సాయంత్రం 4.37), కుందాపుర (సాయంత్రం 5.04), బార్కూర్ (సాయంత్రం 5.20), ఉడిపి (సాయంత్రం 5.37) స్టేషన్ల మీదుగా రాత్రి 8.00 గంటలకు మంగళూరు సెంట్రల్ చేరుకుంటుంది. అక్కడ నుంచి బయలుదేరి మరుసటి రోజు రాత్రి 11.40 గంటలకు కాచిగూడకు చేరుకుంటుంది.
ఈ రైలు పొడిగింపుతో మురుడేశ్వర్, కుంట పరిసర ప్రాంతాల పర్యాటక స్థలాలను సందర్శించాలనుకునే హైదరాబాద్ ప్రయాణికులకు నేరుగా రవాణా సౌకర్యం లభించినట్లయింది. ప్రయాణికులు ఈ మార్పులను గమనించి….. రైల్వే ఐఆర్సీటీసీ (IRCTC) వెబ్సైట్ లేదా కౌంటర్ల ద్వారా పొడిగించిన స్టేషన్ వరకు తమ టికెట్లను రిజర్వేషన్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

