మాగంటి గోపీనాథ్ కుమార్తెలకు రోడ్డు ప్రమాదం.. పెద్ద కుమార్తె పరిస్థితి విషమం!
దివంగత నేత మాగంటి గోపీనాథ్ కుమార్తెలు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. పెద్ద కుమార్తె పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.
హైదరాబాద్ ఓఆర్ఆర్పై ఆదివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ కారు ప్రమాదంలో దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కుమార్తెలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో మాగంటి పెద్ద కుమార్తె పరిస్థితి విషమంగా ఉంది. రెండో కుమార్తె గాయాలతో బయటపడ్డారు. ఇద్దరూ ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

గచ్చిబౌలి సమీపంలో ప్రయాణించే సమయంలో వీరి ఫార్చ్యూనర్.. కారు ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయింది. ఆ తర్వాత ప్రమాదం జరిగింది. ఈ సమయంలో మాగంటి గోపీనాథ్ కుమార్తెలు అక్షర, దిశర అందులోనే ఉన్నారు. అతివేగం ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ప్రమాద తీవ్రతతో కారు దెబ్బతిన్నది. స్థానికులు, పోలీసులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు.
ఈ ఘటనలో పెద్ద కుమార్తె అక్షర తలకు తీవ్రగాయాలు అయ్యాయి. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. మరో కుమార్తె దిశర స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రస్తుతం బాధితులిద్దరినీ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
బీఆర్ఎస్ (BRS) జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ జూన్ 2025లో చనిపోయారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మరణించారు. మాగంటి గోపీనాథ్ 1983లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. పార్టీలో పలు బాధ్యతలను నిర్వర్తించారు. టీడీపీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా కూడా పని చేశారు.
2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ తరపున జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తరువాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018, 2023 ఎన్నికల్లో ఆ పార్టీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. జూబ్లిహిల్స్ నియోజకవర్గంలో గోపినాథ్కు ప్రత్యేకమైన స్థానం ఉంది.
మాగంటి మరణంపై అనుమానాలు ఉన్నాయంటూ ఆయన తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. జూబ్లిహిల్స్ ఉప ఎన్నిక సమయంలో మాగంటి మరణంపై రాజకీయం జరిగింది. మాగంటి భార్యను బీఆర్ఎస్ అభ్యర్థిగా నిలబెట్టింది. నవీన్ యాదవ్ను కాంగ్రెస్ బరిలోకి దించింది. ఈ ఉపఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ గెలిచిన విషయం తెలిసిందే.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


