అర్హులైన విద్యార్థులు, ప్రతిభావంతులైన క్రీడాకారులకు ఉచిత శిక్షణ
తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (SATG) కీలక నిర్ణయం తీసుకుంది. క్రీడాకారులు, తల్లిదండ్రుల నుండి వచ్చిన అభిప్రాయాల మేరకు ఇటీవల సవరించిన క్రీడా శిక్షణ ఫీజుల విధానాన్ని సమీక్షించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయనుంది.
తెలంగాణ క్రీడాప్రాధికార సంస్థ(స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ - SATG) ఇటీవల సవరించిన క్రీడా కోచింగ్ ఫీజుల నిర్మాణంపై పునరాలోచనలో పడింది. క్రీడాకారులు, వారి తల్లిదండ్రుల నుండి వచ్చిన విజ్ఞప్తులు, అభిప్రాయాల ఆధారంగా ఈ ఫీజుల నిర్మాణాన్ని సమీక్షించేందుకు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది.

హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఎస్ఏటీజీ ఛైర్మన్ కే శివసేన రెడ్డి, వైస్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎ. సోనిబాలా దేవి అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఈ ముల్యాంకన నిర్ణయాన్ని తీసుకున్నారు. సవరించిన ఫీజులపై తలెత్తిన వివాదంపై ఎస్ఏటీజీ యాజమాన్యం స్పష్టత ఇచ్చింది. ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం శిక్షణ పొందుతున్న వారిలో 42 శాతానికి పైగా క్రీడాకారులకు ఉచితంగా కోచింగ్ లభిస్తుందని వివరించింది.
గతంలో ఉన్న ఫీజుల విధానంతో పోలిస్తే, ఈ నూతన జీవో ద్వారా విద్యార్థుల విద్యా నేపథ్యం, ఆర్థిక పరిస్థితిని ప్రాతిపదికగా తీసుకుని ఉచిత శిక్షణ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొంది. ఈ సందర్బంగా ఛైర్మన్ శివసేన రెడ్డి మాట్లాడుతూ, ఉచిత కోచింగ్ అర్హతలకు సంబంధించిన కీలక వివరాలను వెల్లడించారు.
ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులందరికీ సంపూర్ణ ఉచిత కోచింగ్ అందిస్తారు. ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతూ, వారి వార్షిక ట్యూషన్ ఫీజు రూ.35,000 వరకు ఉన్న విద్యార్థులు కూడా ఈ ఉచిత శిక్షణ పథకానికి అర్హులు.
గుర్తింపు పొందిన క్రీడా పోటీలు లేదా అంతకంటే ఉన్నత స్థాయి పోటీల్లో తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులకు వారి సంబంధిత క్రీడల్లో ఏడాది పొడవునా ప్రాక్టీస్ సదుపాయాలను ఉచితంగా వినియోగించుకునే వెసులుబాటు కొనసాగుతుంది.
సవరించిన జీవో ద్వారా ఏ స్థాయిలో లబ్ధి చేకూరుతుందో వివరించేందుకు ఎస్ఏటీజీ తన పరిధిలోని పలు శిక్షణా కేంద్రాల డేటాను వెల్లడించారు. కేవీబీఆర్ ఇండోర్ స్టేడియంలో 10 క్రీడా విభాగాల్లో శిక్షణ పొందుతున్న మొత్తం క్రీడాకారులలో 57 శాతం మంది ఉచిత కోచింగ్ పొందుతారు.
జింఖానా మైదానం ఇక్కడ శిక్షణ పొందే వారిలో 65 శాతం మందికి ఉచిత సదుపాయం లభిస్తుంది. హుస్సేన్ సాగర్ వాటర్ స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్ అత్యధికంగా 88 శాతం మంది క్రీడాకారులకు ఉచిత శిక్షణ లభించనుంది. కయాకింగ్, కెనోయింగ్.. ఈ రెండు సాహస జల క్రీడలలో నమోదు చేసుకున్న క్రీడాకారులందరికీ (100 శాతం) సంపూర్ణ ఉచిత కోచింగ్ అందించనున్నారు.
ఉస్మానియా యూనివర్సిటీ సైక్లింగ్ వేలోడ్రోమ్.. ఇక్కడ 57 శాతం మంది సైక్లిస్టులు ఉచితంగా శిక్షణ పొందుతున్నారు. ఎల్బీ స్టేడియంలో దాదాపు 42 శాతం మందికి, గచ్చిబౌలిలోని జీఎమ్సీ బాలయోగి స్టేడియంలో 35 శాతం మందికి ఉచితంగా కోచింగ్ అందుతోంది.
త్వరలోనే ఏర్పాటుకానున్న ప్రత్యేక కమిటీ ఈ సవరించిన ఫీజుల నిర్మాణాన్ని లోతుగా పరిశీలించి, అవసరమైన ప్రదేశాల్లో ఫీజులను సరళీకృతం చేయడానికి తగిన సిఫార్సులు చేస్తుందని ఎస్ఏటీజీ యాజమాన్యం వెల్లడించింది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


