SCR Charlapalli Kakinada Special Trains : హైదరాబాద్ నుంచి కోస్తాంధ్ర వైపు వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. రాఖీ పండగతో పాటు సెలవులు ఉండటంతో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దీంతో చర్లపల్లి – కాకినాడ టౌన్ మధ్య ప్రత్యేక రైళ్లను (Special Trains) నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది.
ట్రైన్ టైమింగ్స్ వివరాలు…
- రైలు నంబరు 07039 (చర్లపల్లి – కాకినాడ టౌన్) : ఈ ప్రత్యేక రైలు 2026 ఆగస్టు 27 గురువారం రోజున రాత్రి 19:50 గంటలకు చర్లపల్లి స్టేషన్ నుంచి బయలుదేరుతుంది. మరుసటి రోజు (ఆగస్టు 28 శుక్రవారం) ఉదయం 09:30 గంటలకు కాకినాడ టౌన్ చేరుకుంటుంది.
- రైలు నంబరు 07040 (కాకినాడ టౌన్ – చర్లపల్లి) : తిరుగు ప్రయాణంలో ఈ రైలు 2026 ఆగస్టు 28 శుక్రవారం రోజున సాయంత్రం 18:50 గంటలకు కాకినాడ టౌన్ నుంచి బయలుదేరి, మరుసటి రోజు (ఆగస్టు 29 శనివారం) ఉదయం 07:30 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది.

తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్యమైన పట్టణాలను అనుసంధానిస్తూ ఈ ప్రత్యేక రైళ్లకు హాల్ట్లను కేటాయించారు. ఈ రైళ్లు రెండు మార్గాల్లోనూ పలు స్టేషన్లలో ఆగుతాయి. దక్షిణ మధ్య రైల్వే ప్రకటనలోని వివరాల ప్రకారం.... నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ,గుడివాడ,భీమవరం,తణకు, రాజమండ్రి,సామర్లకోటలో హాల్ట్ ఉంటుంది.
ప్రయాణికుల అన్ని వర్గాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రత్యేక రైళ్లలో బోగీలను అమర్చారు. వీటిలో ఫస్ట్ ఏసీ (1AC), స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లను అందుబాటులో ఉంచారు. రద్దీ ఎక్కువగా ఉన్నందున ప్రయాణికులు ముందస్తుగానే రిజర్వేషన్లు చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.