Southwest Monsoon 2026 : తెలంగాణకు చల్లని కబురు - ఈ నెలాఖరులోనే రానున్న నైరుతి రుతుపవనాలు..!
Southwest Monsoon 2026 Updates: ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందస్తుగానే తెలంగాణను తాకనున్నాయి. మే 26వ తేదీన దేశ దక్షిణ భాగాన్ని పలకరించనున్న ఈ పవనాలు…. మే నెలాఖరు నాటికి రాష్ట్రంలోకి ప్రవేశించేందుకు సానుకూల పరిస్థితులు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
Southwest Monsoon 2026 : భీకరమైన ఎండలు, ఉక్కపోతతో అల్లాడిపోతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. ఈ ఏడాది వర్షాకాలాన్ని మోసుకొచ్చే నైరుతి రుతుపవనాలు ముందస్తుగానే రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాస్త ముందుగానే… అంటే ఈ మే నెలాఖరు నాటికే రుతుపవనాలు తెలంగాణను తాకుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

ఈ నెల 26వ తేదీన నైరుతి రుతుపవనాలు భారత దేశ దక్షిణ భాగాన్ని తాకే సూచనలున్నాయి. సాధారణంగా రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకిన తర్వాత అక్కడి నుంచి రాయలసీమ, దక్షిణ తెలంగాణ జిల్లాల్లోకి ప్రవేశించడానికి దాదాపు ఐదు రోజుల సమయం పడుతుంది.
గతేడాది వాతావరణ గణాంకాలను పరిశీలిస్తే…. మే 24వ తేదీన కేరళను తాకిన రుతుపవనాలు, మే 31వ తేదీ నాటికి తెలంగాణను పలకరించాయి. ఈ ఏడాది కూడా అదే తరహాలో మే నెలాఖరుకల్లా రాష్ట్రంలో వర్షాగమనం మొదలయ్యేందుకు బలమైన సానుకూలతలు కనిపిస్తున్నాయి. ముందస్తు రాకపై రైతాంగంతో పాటు అన్ని వర్గాల ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది. అయితే…. ఈ వర్షాకాలంలో సాధారణం కన్నా కొంచెం తక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ ఇప్పటికే అంచనా వేసింది.
మరోవైపు రాష్ట్రంలో ఎండల తీవ్రత ఇంకా కొనసాగుతూనే ఉంది. శుక్రవారం పగటిపూట రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండలంలో 44.5 డిగ్రీల సెల్సియస్ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. భానుడి భగభగలతో ఉత్తర తెలంగాణ జిల్లాలు అల్లాడిపోతున్నాయి.
కొనసాగుతున్న అల్పపీడనం…
ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇవాళ(శనివారం) ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో పగటి ఎండల నుంచి ఉపశమనం లభిస్తూ….. తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణశాఖ సూచించింది. ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

