రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు మరోసారి రంగం సిద్ధమవుతోంది. పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లేందుకు సర్కార్ సిద్ధమవుతున్న నేపథ్యంలో…. ఈసీ కూడా స్పీడ్ పెంచింది. ఇందులో భాగంగా పంచాయతీల్లో ఓటరు జాబితా సవరణకు తాజాగానే షెడ్యూల్ కూడా ప్రకటించింది.
ఇవాళ్టి నుంచే సవరణ ప్రక్రియ….

ఇవాళ్టి నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామాల్లో ఓటర్ల జాబితాలను సవరించే ప్రక్రియ షురూ అయింది. ఈనెల 23 వరకు ఈ ప్రాసెస్ పూర్తి చేయాలని ఈసీ ఆదేశించింది. ఇవాళ ఓటర్ల దరఖాస్తులు, అభ్యంతరాల స్వీకరణ, తప్పుల సవరణకు అవకాశం ఉండగా… ఈనెల 21వ తేదీన ఓటర్ల దరఖాస్తులు, అభ్యంతరాల పరిష్కారం ఉంటుంది. ఇక ఈనెల 23వ తేదీన ఫైనల్ ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల ప్రచురణ ఉంటుంది.
డిసెంబర్ లో ఎన్నికల షెడ్యూల్…!
డిసెంబరు రెండో వారంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు షెడ్యూలు వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. ముందుగా గ్రామ పంచాయతీ ఎన్నికలను పూర్తి చేయాలని కేబినెట్ లో కూడా నిర్ణయించారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 2వ వారంలో షెడ్యూల్ ఇచ్చి… అదే నెలాఖరులోపు గ్రామ పంచాయతీ ఎన్నికలను పూర్తి చేసే వీలుంది.
ఈనెల 24న హైకోర్టులో స్థానిక సంస్థల ఎన్నికలపై మరోసారి విచారణ జరగనుంది. ఆ రోజు ప్రభుత్వ వైఖరిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. మరోవైపు 15వ ఆర్థిక సంఘం కాల పరిమితి 2026 మార్చి 31తో ముగియనుంది. ఆలోపు పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోతే గ్రామాలకు రావాల్సిన రూ.3 వేల కోట్ల ఆర్థిక సంఘం నిధులు మురిగిపోతాయని ప్రభుత్వం చెబుతోంది. ఈ నేపథ్యంలో డిసెంబరులో ఎలాగైనా పంచాయతీ ఎన్నికలను పూర్తి చేయాలని యోచిస్తోంది. బీసీ రిజర్వేషన్లను కూడా పార్టీ పరంగా ఇచ్చి ముందుకెళ్తామని కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రకటించింది.