...
...
Next Story

Summer Tips : ముదురుతున్న ఎండలు.. అధిక ఉష్ణోగ్రతలకు ఆరోగ్య శాఖ చెప్పిన సలహాలు ఇవే

Telangana Weather : తెలంగాణలో రోజురోజుకు ఎండలు ముదురుతున్నాయి. బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంది. ఆరోగ్య శాఖ పౌరులకు సూచనలు జారీ చేసింది.

Published on: Mar 7, 2026, 10:27:10 IST
Advertisement

రాష్ట్రవ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు రాబోయే మూడు రోజుల్లో క్రమంగా పెరుగుతాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. వేడిగాలుల పరిస్థితులపై సరైన జాగ్రత్తలు తీసుకోవాలని తెలంగాణ ఆరోగ్య శాఖ పౌరులను కోరుతూ ఒక హెచ్చరికను జారీ చేసింది.

వేసవి ఆరోగ్య చిట్కాలు
వేసవి ఆరోగ్య చిట్కాలు

ఈ సలహా ప్రకారం, ప్రజలు బాగా హైడ్రేటెడ్‌గా ఉండాలని, దాహం వేయకపోయినా తగినంత నీరు క్రమం తప్పకుండా తాగాలని కోరింది. ప్రజలు ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్(ఓఆర్ఎస్) ఉపయోగించాలని, నిమ్మకాయ నీరు, మజ్జిగ, పండ్ల రసాలు, ఉప్పు-చక్కెర ద్రావణం వంటి ఇంట్లో తయారుచేసిన పానీయాలను తీసుకోవాలని అధికారులు సూచించారు. ఎక్కడికైనా ప్రయాణించేటప్పుడు నీటిని తీసుకెళ్లాలని, స్థానికంగా లభించే ఇతర ఉత్పత్తులతో పాటు పుచ్చకాయ, నారింజ, ద్రాక్ష, పైనాపిల్స్, దోసకాయలు వంటి అధిక నీటి శాతం కలిగిన కాలానుగుణ పండ్లు, కూరగాయలను తినాలని కూడా పౌరులకు తెలిపారు.

ప్రజలు బయట అడుగు పెట్టేటప్పుడు సరైన దుస్తులు ధరించి.. పూర్తిగా కప్పబడి ఉండేలా చూసుకోవాలని ఆరోగ్య శాఖ అధికారులు సూచించారు. సన్నని, వదులుగా ఉండే కాటన్ దుస్తులు, లేత రంగు దుస్తులు ధరించాలన్నారు. ప్రత్యక్ష సూర్యకాంతికి గురైనప్పుడు గొడుగు, టోపీ, టవల్ లేదా ఇతర సాంప్రదాయ తలపాగాతో తల కప్పుకోవాలని ఆరోగ్య శాఖ సిఫార్సు చేస్తోంది.

వీలైనంత వరకు జనాలు ఇంటి లోపలే ఉండాలని, బాగా వెంటిలేషన్ ఉన్న, చల్లని ప్రదేశాలలో ఉండాలని సలహా జారీ చేసింది ఆరోగ్య శాఖ. బహిరంగ కార్యకలాపాలను రోజులోని చల్లని సమయాల్లో, ముఖ్యంగా ఉదయం, సాయంత్రం సమయాల్లో మాత్రమే పరిమితం చేయాలని తెలిపింది. వంట ప్రదేశాలలో తలుపులు, కిటికీలు తెరవడం ద్వారా సరైన వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలి.

మధ్యాహ్నం 12 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎండలో బయటకు వెళ్లకుండా, మధ్యాహ్నం సమయంలో కఠినమైన పనులకు దూరంగా ఉండాలని ఆరోగ్య శాఖ ప్రజలకు సలహా ఇచ్చింది. అధిక ప్రోటీన్, ఉప్పగా, కారంగా, నూనెతో కూడిన ఆహారాన్ని తగ్గించాలని, ఫ్రెష్‌గా వండిన ఆహారం తినాలని తెలిపింది.

ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక పడకలు, ఇంట్రావీనస్ ద్రవాలు, అవసరమైన మందులను అందించడం ద్వారా ఏర్పాట్లు చేసింది. అత్యవసర పరిస్థితులకు స్పందించడానికి ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ కార్యకర్తలకు కూడా ఓఆర్ఎస్ పంపిణీ చేసినట్టుగా అడ్వైజరీలో ఆరోగ్య శాఖ తెలిపింది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe