Telangana Assembly : శాసనసభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్ - ఈ సెషన్ ముగిసే వరకు అమలు..!

Telangana Assembly BRS MLAs Suspended : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా సాగుతున్నాయి. ఇవాళ సభ ప్రారంభం కాగానే బీఆర్‌ఎస్‌ సభ్యులు నినాదాలు చేయగా.. వారిని ఈ అసెంబ్లీ సెషన్‌ ముగిసే వరకు సస్పెండ్‌ చేస్తున్నట్టు స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ ప్రకటించారు.

Published on: Sep 9, 2026, 11:24:48 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Telangana Assembly BRS MLAs Suspended : తెలంగాణ శాసనసభ సమావేశాలు మూడో రోజు తీవ్ర ఆందోళనల నడుమ ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన కొద్దిసేపటికే బీఆర్ఎస్ సభ్యుల నిరసనలతో అసెంబ్లీ ప్రాంగణం హోరెత్తింది. సభా వ్యవహారాలకు నిరంతరం అడ్డంకి కలిగిస్తున్నారనే కారణంతో కేటీఆర్, హరీశ్‌రావులతో సహా ఇతర శాసనసభ్యులను ఈ సెషన్ పూర్తయ్యే వరకు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధికారికంగా ప్రకటించారు.

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

బీఆర్ఎస్ వాయిదా తీర్మానం…

బుధవారం ఉదయం మూడో రోజు సభా కార్యకలాపాలు ప్రారంభం కాగానే… బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై దాడి, కేసీఆర్ ఇంటి వద్ద ర్యాలీ, శాంతి భద్రతల అంశాలపై వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టింది.ఈ మూడు అంశాలపై సభ వెంటనే చర్చించాలని కోరింది. ఈ తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. దీంతో బీఆర్‌ఎస్ సభ్యులు ప్లకార్డులతో స్పీకర్ పొడియం వద్దకు దూసుకెళ్లారు. "వియ్ వాంట్ జస్టిస్" అంటూ నినాదాలు చేస్తూ అడ్డుకున్నారు. విపక్ష సభ్యుల ఆందోళనతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. సభను సమర్థవంతంగా నిర్వహించేందుకు సహకరించాలని స్పీకర్ కోరినప్పటికీ ప్రజా సమస్యల అంశాలపై నిరసనను బీఆర్‌ఎస్ నేతలు కొనసాగించారు.

సభను అడ్డుకుంటున్న విపక్ష సభ్యుల తీరుపై శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి డి. శ్రీధర్‌బాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సభా సంప్రదాయాలను విస్మరిస్తూ నిరంతరం అలజడి సృష్టిస్తున్న బీఆర్‌ఎస్ సభ్యులను ప్రస్తుత అసెంబ్లీ సెషన్ ముగిసే వరకు సస్పెండ్ చేయాలని మంత్రి శ్రీధర్‌బాబు సభలో ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు సభ ఆమోదం తెలపడంతో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సస్పెన్షన్ వేటు వేశారు.

సస్పెన్షన్‌కు గురైన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు వీరే….

కేటీఆర్ , హరీశ్‌రావు, మర్రి రాజశేఖర్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, కాలేరు వెంకటేష్, విజయుడు, జి. జగదీష్ రెడ్డి, అనిల్ జాదవ్, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి, కోవా లక్ష్మి, వి. సునీతా లక్ష్మారెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, మాధవరం కృష్ణారావు, మాణిక్ రావు, చింతా ప్రభాకర్, వేముల ప్రశాంత్ రెడ్డి.

ప్రధాన ప్రతిపక్ష నేతలందరినీ ఒకేసారి సభ నుంచి సస్పెండ్ చేయడంతో అసెంబ్లీ వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ప్రభుత్వం తమ గొంతు నొక్కేందుకే ఈ సస్పెన్షన్లకు పాల్పడిందని సస్పెండ్ అయిన బీఆర్‌ఎస్ నేతలు మండిపడ్డారు.

మండలి నుంచి వాకౌట్…

శాసనసభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సెషన్ మొత్తం సస్పెన్షన్‌ చేసినందుకు నిరసనగా శాసన మండలి నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు వాకౌట్ చేశారు. ఈ మేరకు మండలి ప్రతిపక్ష నాయకుడు మధుసూధన చారి ప్రకటన చేశారు. ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండించారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More