ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై చర్చ జరిగింది. మంత్రివర్గ నిర్ణయాలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు తెలంగాణ సర్కార్ గుడ్న్యూస్ చెప్పింది. 60 సంవత్సరాలలోపు ఉద్యోగి చనిపోతే రెగ్యులర్ బెనిఫిట్స్తోపాటుగా అదనంగా రూ.10లక్షలు వచ్చేలా చర్యలు చేపట్టినట్టుగా తెలిపింది.

ఉద్యోగుల ఆరోగ్య భద్రత, ప్రమాదల విషయంపై కేబినెట్ చర్చించి కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు, పింఛనర్లకు భారం కాకుండా.. చర్యలను ప్రభుత్వం తీసుకుంటుంది. తెలంగాణలోని 7.56 లక్షల మంది ఉద్యోగులు, పింఛనర్లు ఉన్నారని, ఉద్యోగి చనిపోతే రెగ్యులర్ బెనిఫిట్స్తోపాటుగా అదనంగా రూ.10లక్షలు వచ్చేలా పథకం తీసుకొస్తామని మంత్రి పొంగులేటి ప్రకటించారు. 17.7లక్షల మంది ఉద్యోగులు, పింఛనర్లకు డిజిటల్ హెల్త్ ఎంప్లాయ్ కార్డులు అందజేస్తామన్నారు.
1998 వ్యాధులకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 652 ఆసుపత్రుల్లో చికిత్స అందేలా ఏర్పాట్లు చేస్తామని మంత్రి పొంగులేటి వెల్లడించారు. రాబోయే రెండుమూడు రోజుల నుంచి ఎంప్యానల్ ఆసుపత్రుల్లో చికిత్సకు ఏర్పాట్లు చేస్తామన్నారు. ఉద్యోగుల బేసిక్ పే నుంచి 1.5 శాతం ట్రస్టుకు జమ అయ్యేలా చర్యలు చేపడతామన్నారు. ఉద్యోగుల నుంచి రూ.528 కోట్లు సేకరిస్తామన్నారు. అంతేకాదు అదనంగా ప్రభుత్వం మరో రూ.528 కోట్లు యాడ్ చేసి.. ట్రస్టు ఖాతాలో జమ చేస్తుందన్నారు. సీఎస్, సభ్యుల ఆధ్వర్యంలో ట్రస్టు నిర్వహణ ఉంటుందని పొంగులేటి తెలిపారు.
కేబినెట్ నిర్ణయాలు
- ప్రస్తుతం హైదరాబాద్ మెట్రోను ఎల్అండ్టీ నుంచి పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకునేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో మార్చి 13వ తేదీలోపు మెట్రోను పూర్తిగా స్వాధీనం చేసుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ టేకోవర్ మెుత్తం విలువ సుమారు రూ.15000 కోట్లుగా అంచనా.
- మార్చి 16 నుండి 30 వరకు జరగనున్న రాష్ట్ర బడ్జెట్ సమావేశాలకు సంబంధించిన వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించింది.
- బడ్జెట్ సమావేశాలు మార్చి 16న గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమవుతాయి. మార్చి 20న బడ్జెట్ను ప్రవేశపెడతారు. మార్చి 30 వరకు సమావేశాలు జరుగుతాయి.
- తెలంగాణ వైద్య విధాన పరిషత్ (TVVP) పేరును డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్గా మార్చాలని, దాని ఉద్యోగులను నేరుగా రాష్ట్ర ప్రభుత్వం కిందకు తీసుకురావాలని కూడా నిర్ణయించారు.
- ఖమ్మం జిల్లాలో తిరుమల తిరుపతి దేవస్థానాలకు (టీటీడీ) 20 ఎకరాల భూమిని కేటాయించడం, కాంగ్రెస్ జిల్లా కార్యాలయాల నిర్మాణానికి భూమి కేటాయింపులు, మహబూబాబాద్లోని గుమ్మదూర్ గ్రామంలో జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూ)కి 70 ఎకరాల భూమిని కేటాయించడం వంటి నిర్ణయాలకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
- వేసవికాలంలో మూడు నెలల నీటి సరఫరా ప్రణాళికతో పాటు ఆరోగ్యం, విద్యపై కూడా మంత్రివర్గం చర్చించింది.
- 2027 జాతీయ జనాభా లెక్కలకు కేంద్రం ప్రణాళికలు, రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన ఏర్పాట్లపై కూడా వివరంగా చర్చించారు.
- హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ (HLO) మొదటి దశ మే 11 నుండి జూన్ 9 వరకు నిర్వహిస్తారని, కేంద్రం అందించిన 34 నమూనా ప్రశ్నలతో సహా ఏర్పాట్లను సమీక్షించామని ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తెలిపారు. జనాభా గణనలో దాదాపు 89,000 మంది పాల్గొంటారు.