TG Cheyutha Pension Scheme : కొత్త పింఛన్ దరఖాస్తులు - దగ్గరపడిన గడువు, వెంటనే ఇలా అప్లై చేయండి!
Telangana Cheyutha Pension Scheme : కొత్త చేయూత పింఛన్ల దరఖాస్తుకు ఆగస్టు 31 చివరి తేదీ. అర్హులైన లబ్ధిదారులు అవసరమైన పత్రాలతో వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.
Telangana Cheyutha Pension Scheme : నిరుపేదలకు, ఆసరా అవసరమైన వారికి నూతన ఊరటనిచ్చే 'చేయూత' పింఛను పథకానికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. ప్రభుత్వం కేటాయించిన నిర్ణీత గడువు దగ్గరపడుతుండటంతో అర్హులైన లబ్ధిదారులు త్వరపడాలని అధికారులు స్పష్టం చేశారు.

ఈనెల (ఆగస్టు) 31వ తేదీ వరకు మాత్రమే దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఈ పథకం కింద నూతన పింఛన్ల కోసం ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఆగస్టు 9వ తేదీన ప్రారంభమైన సంగతి తెలిసిందే. అర్హత ఉండి ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని వారు వెంటనే స్పందించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.
దరఖాస్తు విధానం – ఎక్కడ, ఎలా అప్లై చేయాలి..?
అర్హులైన లబ్ధిదారులు చేయూత అధికారిక వెబ్సైట్ ( cheyutha.telangana.gov.in ) నుంచి దరఖాస్తు ఫారమ్ను నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్న ఫారమ్ను సమగ్రంగా నింపి, దానికి అవసరమైన అన్ని ధృవీకరణ పత్రాలను జత చేయాల్సి ఉంటుంది.
గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వారు పూర్తి చేసిన దరఖాస్తులను పంచాయతీ కార్యదర్శులకు, పట్టణ ప్రాంతాల్లో నివసించే వారు బిల్ కలెక్టర్లకు నేరుగా సమర్పించవచ్చు. ఆఫ్లైన్ విధానంతో పాటు ప్రజా సౌకర్యార్థం ఆన్లైన్ సమర్పణ సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తెచ్చారు. మీసేవా కేంద్రాలు, ఎంపీడీవో కార్యాలయాలు, మండల సమాఖ్యలు, మున్సిపల్ ఆఫీసులు లేదా వార్డు కార్యాలయాలకు వెళ్లి దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు.
తప్పనిసరిగా సమర్పించాల్సిన పత్రాలు :
- పూర్తిగా నింపిన నూతన దరఖాస్తు ఫారం
- అభ్యర్థి ఆధార్ కార్డు
- వయో నిర్ధారణ పత్రం (జనన ధృవీకరణ పత్రం / పాఠశాల స్టడీ సర్టిఫికెట్ / ఓటర్ కార్డు)
- ఆహార భద్రతా కార్డు (రేషన్ కార్డు) లేదా రెవెన్యూ శాఖ జారీ చేసిన వార్షిక ఆదాయ ధృవీకరణ పత్రం
- బ్యాంక్ పాస్బుక్ మొదటి పేజీ (దివ్యాంగులైన మైనర్ పిల్లల విషయంలో తల్లిదండ్రులతో కూడిన జాయింట్ ఖాతా వివరాలు)
- వితంతు పింఛన్ దరఖాస్తుదారులు: భర్త మరణ ధృవీకరణ పత్రం, భర్త ఆధార్ కార్డు
- ఒంటరి మహిళ పింఛన్ దరఖాస్తుదారులు: విడాకులు/విడిపోయిన పత్రం లేదా తహసీల్దార్ విచారణ నివేదిక
- చేనేత కార్మికులు: చేనేత అండ్ జౌళి శాఖ జారీ చేసిన ధృవీకరణ పత్రం
- కల్లు గీత కార్మికులు: ఎక్సైజ్ శాఖ జారీ చేసిన ధృవీకరణ పత్రం
సెప్టెంబరు 1 నుంచి క్షేత్రస్థాయి విచారణ:
మరోవైపు… అందిన దరఖాస్తుల పరిశీలన మరియు అర్హుల గుర్తింపు ప్రక్రియపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. సెప్టెంబరు 1 నుంచి క్షేత్రస్థాయి విచారణ కార్యక్రమం ప్రారంభం కానుంది. గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ కార్యదర్శులు, పట్టణ ప్రాంతాల్లో బిల్ కలెక్టర్లు మరియు వార్డు అధికారులు నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వివరాలను సరిచూస్తారు. ఈ ఎంపిక ప్రక్రియ వేగవంతంగా, అత్యంత పారదర్శకంగా సాగేందుకు స్థానిక మహిళా స్వయం సహాయక సంఘాల (SHG) సహాయాన్ని కూడా తీసుకోనున్నారు.
క్షేత్రస్థాయి అధికారులు సేకరించిన నివేదికలను మొదట మండల, పట్టణ స్థాయి అధికారులకు పంపుతారు. అక్కడ ప్రాథమిక పరిశీలన పూర్తయిన తర్వాత ఆయా జాబితాలు జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలోకి వెళ్తాయి. కలెక్టర్ల ఆమోదం పొందిన అనంతర నివేదికలను తుది అనుమతి కోసం సెర్ప్ ప్రధాన కార్యాలయానికి నివేదిస్తారు. సెర్ప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దరఖాస్తులను సమగ్రంగా పరిశీలించి, అర్హులైన కొత్త పింఛనుదారుల తుది జాబితాను అధికారికంగా ఖరారు చేస్తారు. అర్హులైన పేదలకు ఎటువంటి ఆలస్యం లేకుండా త్వరితగతిన పింఛన్ డబ్బులు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తోంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

