Fuel Supply : రాష్ట్రంలో పెట్రోల్ కొరత లేదు.. వదంతులు నమ్మొద్దు - తెలంగాణ పౌరసరఫరాల శాఖ
Fuel Supply in Telangana : పెట్రోల్, డీజిల్ కొరత ఉందంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలను తెలంగాణ పౌరసరఫరాల శాఖ ఖండించింది. రాష్ట్రంలో సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని…. ప్రజలు భయాందోళన చెందవద్దని స్పష్టం చేసింది.
Fuel Supply in Telangana : రాష్ట్రంలో ఇంధన కొరత ఏర్పడిందంటూ గత కొద్ది గంటలుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై పౌరసరఫరాల శాఖ స్పందించింది. రాష్ట్రంలో సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని…. ప్రజలు భయాందోళన చెందవద్దని స్పష్టం చేసింది. వదంతులను నమ్మి ప్రజలు ఆందోళనకు గురికావొద్దని స్పష్టమైన భరోసా ఇచ్చింది. ముఖ్యంగా సామాజిక మాధ్యమాల్లో వస్తున్న తప్పుడు సమాచారాన్ని చూసి వాహనదారులు బంకుల వద్దకు క్యూ కట్టవద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

సరిపడా నిల్వలు సిద్ధం…
రాష్ట్రవ్యాప్తంగా వాహనదారులకు, రవాణా రంగానికి, రైతాంగానికి అవసరమైన ఇంధనం అందుబాటులో ఉందని పౌరసరఫరాల శాఖ తెలిపింది. సామాన్యులను తప్పుదారి పట్టించే ఉద్దేశంతోనే కొందరు ఇంధన కొరత ఉందంటూ ప్రచారం చేస్తున్నారని, ఇది కేవలం పుకారు మాత్రమేనని అధికారులు తేల్చి చెప్పింది. భవిష్యత్తు అవసరాల కోసం ప్రజలు ఇప్పుడే పెట్రోల్ లేదా డీజిల్ను ముందస్తుగా కొనుగోలు చేసి ఇళ్లలో నిల్వ చేసుకోవాల్సిన అవసరం లేదని పౌరసరఫరాల శాఖ వివరించింది.
క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ
పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఆయన వివిధ ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో మాట్లాడి….. రాష్ట్రవ్యాప్తంగా ఇంధన సరఫరాలో ఎక్కడా ఆటంకాలు కలగకుండా సమన్వయం చేస్తున్నారు. సోమవారం సాయంత్రం 4:00 గంటల వరకు అందిన అధికారిక లెక్కల ప్రకారం రాష్ట్రంలో సరఫరా అయిన ఇంధనం వివరాలు ఇలా ఉన్నాయి…
- పెట్రోల్ సరఫరా: 7,443 కిలో లీటర్లు
- డీజిల్ సరఫరా: 11,081 కిలో లీటర్లు
- మొత్తం సరఫరా: 18,524 కిలో లీటర్లు
ఈ గణాంకాలను పరిశీలిస్తే రాష్ట్రంలో ఇంధన లభ్యత సాధారణంగానే ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఎక్కడా సంక్షోభం లేదని వివరిస్తున్నారు.
అక్రమ నిల్వలకు పాల్పడితే కఠిన చర్యలు
కొరత ఉందన్న సాకుతో ఎవరైనా ఇంధనాన్ని అక్రమంగా నిల్వ చేసినా, కృత్రిమ కొరతను సృష్టించి ప్రజలను భయాందోళనకు గురిచేసినా చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది. ఇంధనాన్ని ఇళ్లలో నిల్వ చేయడం ప్రమాదకరమని… అటువంటి చర్యలకు ఎవరూ పాల్పడవద్దని సూచించింది.
పెట్రోల్ బంకుల వద్ద సిబ్బందికి, స్థానిక పోలీసులకు ప్రజలు సహకరించాలని పౌరసరఫరాల శాఖ కోరింది. ప్రభుత్వం విడుదల చేసే అధికారిక సమాచారాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలని కోరింది.
ఒకవేళ ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా ఇంధనాన్ని నిల్వ చేస్తున్నట్లు తెలిసినా లేదా బంకుల్లో కావాలని ఇబ్బంది పెడుతున్నట్లు గమనించినా… వెంటనే పౌరసరఫరాల శాఖ హెల్ప్లైన్ నంబర్ 1967 కు సమాచారం అందించాలని అధికారులు సూచించారు. అన్ని జిల్లాల్లో కలెక్టర్లు, సంబంధిత అధికారులు పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నారని… ప్రజలు సంయమనం పాటించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

