అమెరికా రాయబారితో సీఎం రేవంత్ భేటీ: వీసా చిక్కులు, పెట్టుబడులపై కీలక చర్చ
న్యూఢిల్లీలో అమెరికా రాయబారి సెర్జియో గోర్తో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. విద్యార్థుల వీసా ఇంటర్వ్యూ స్లాట్లు పెంచడం, హెచ్-1బి వీసా ప్రక్రియను వేగవంతం చేయడం సహా తెలంగాణలో అమెరికా పెట్టుబడులపై ఇరువురూ సుదీర్ఘంగా చర్చించారు.
తెలంగాణ, అమెరికాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, భారతదేశంలో అమెరికా రాయబారి సెర్జియో గోర్తో న్యూఢిల్లీలో సౌజన్యపూర్వకంగా సమావేశమయ్యారు. దాదాపు 30 నిమిషాలకు పైగా సాగిన ఈ భేటీలో విద్య, ఉపాధి, పెట్టుబడులు, సాంకేతికత, పరిశోధన రంగాల్లో సహకారంపై ఇరువురు నేతలు విస్తృతంగా చర్చించారు.

వీసా ఇంటర్వ్యూ స్లాట్లు పెంచాలని విజ్ఞప్తి
ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లే తెలంగాణ విద్యార్థులకు ఎదురవుతున్న వీసా సమస్యలను ముఖ్యమంత్రి రాయబారి దృష్టికి తీసుకెళ్లారు. విద్యార్థుల వీసాల సంఖ్యను పెంచాలని, సమయానికి ఇంటర్వ్యూ స్లాట్లు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇంటర్వ్యూ స్లాట్ల సంఖ్యను పెంచి, వీసా దరఖాస్తుల పరిశీలనను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
అలాగే అమెరికాలో వివిధ రంగాల్లో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగుల ఆందోళనలను ప్రస్తావించారు. హెచ్-1బి (H-1B) వీసా జారీ, రెన్యూవల్స్, వీసా స్టాంపింగ్ ప్రక్రియను సరళీకృతం చేసి జాప్యాన్ని నివారించాలని కోరారు. వీసా నిబంధనల్లో ఏవైనా మార్పులు ఉంటే ముందుగానే సమాచారం అందించే వ్యవస్థను అందుబాటులోకి తేగలరని సూచించారు. అక్కడ చదువుకుంటున్న విద్యార్థుల రక్షణ, సంక్షేమంపై ప్రత్యేకంగా చర్చించారు.
తెలంగాణలో పెట్టుబడుల ఆహ్వానం
రాష్ట్రంలో అందుబాటులో ఉన్న అపారమైన పెట్టుబడి అవకాశాలను సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. సమాచార సాంకేతికత (IT), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), లైఫ్ సైన్సెస్, ఫార్మాస్యూటికల్స్, స్టార్టప్లు, అధునాతన సాంకేతిక రంగాల్లో అమెరికా సంస్థలతో భాగస్వామ్యానికి తెలంగాణ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
అమెరికా విశ్వవిద్యాలయాలు తెలంగాణలోని విద్యాసంస్థలతో చేతులు కలిపేలా ప్రోత్సహించాలని కోరారు. విద్యార్థుల మార్పిడి ప్రోగ్రామ్లు (Student Exchange), ఉమ్మడి పరిశోధనలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను విస్తరించాలని ప్రతిపాదించారు.
తెలుగు భాష ప్రాధాన్యం.. రాయబారి హామీ
అమెరికాలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న భారతీయ భాషల్లో తెలుగు ఒకటని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. భారత చరిత్ర, సంస్కృతిపై అంబాసిడర్ సెర్గియో గోర్కు ఉన్న అవగాహనను సీఎం ప్రశంసించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, వంటకాలపై రాయబారి చూపిన ఆసక్తిని అభినందించారు.
"తెలంగాణ, అమెరికా మధ్య వాణిజ్య, పెట్టుబడి, సాంస్కృతిక బంధాలను, ప్రజా సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు సంపూర్ణ సహకారం అందిస్తాం" అని రాయబారి సెర్జియో గోర్ హామీ ఇచ్చారు.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్లో సాక్షి టాస్క్ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్గా, సబ్ ఎడిటర్గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


