రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలల ఫీజుల నిర్వహణలో పారదర్శకత పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2026-27 విద్యాసంవత్సరానికి గాను ఆయా పాఠశాలల్లో తరగతుల వారీగా వసూలు చేస్తున్న ఫీజు వివరాలను వెంటనే నోటీస్ బోర్డుల్లో, పాఠశాల అధికారిక వెబ్సైట్లతో పాటు విద్యాశాఖ పోర్టల్లో బహిరంగంగా ప్రదర్శించాలని ప్రైవేట్ యాజమాన్యాలను ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఇ. నవీన్ నికోలస్ శుక్రవారం ప్రకటన విడుదల చేశారు.
ఫీజు వివరాలు చెప్పాల్సిందే…

పాఠశాల విద్యాశాఖ పరిధిలోని అన్ని ప్రైవేట్ ఎయిడెడ్, అన్-ఎయిడెడ్ విద్యాసంస్థలు ఈ ఆదేశాలను కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత విద్యాశాఖ అధికారులను ఆయన కోరారు. స్కూల్ నోటీస్ బోర్డు, సొంత వెబ్సైట్తో పాటు విద్యాశాఖకు చెందిన అధికారిక పోర్టల్ "schooledu.telangana.gov.in" లో ఫీజుల సమగ్ర వివరాలను పొందుపరచాలని స్పష్టం చేశారు.
ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు తమ ఫీజుల నిర్మాణాన్ని సులభంగా అప్లోడ్ చేసేందుకు వీలుగా "schooledu.telangana.gov.in" పోర్టల్లో ప్రత్యేక సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ విషయాన్ని గమనించి పాఠశాల విద్యా ప్రాంతీయ విభాగాధికారులు (RJD), జిల్లా విద్యాశాఖాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని నవీన్ నికోలస్ సూచించారు.
1994లో జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వుల నిబంధనలకు అనుగుణంగా…. 2026-27 విద్యాసంవత్సరానికి నిర్ణయించిన తరగతుల వారీ ఫీజుకు సంబంధించి స్కూల్ గవర్నింగ్ బాడీ సభ్యులు సంతకం చేసిన పత్రాలను కూడా వెబ్సైట్లో తప్పనిసరిగా అప్లోడ్ చేయాలని ఆదేశించారు.
ప్రభుత్వ నిబంధనలను పాటించకుండా నోటీస్ బోర్డుల్లో లేదా వెబ్సైట్లలో ఫీజుల వివరాలను ప్రదర్శించని పాఠశాల యాజమాన్యాలపై కఠిన చర్యలు ఉంటాయని విద్యాశాఖ హెచ్చరించింది. ఆదేశాలు ఉల్లంఘించిన విద్యాసంస్థలకు వెంటనే షోకాజ్ నోటీసులు జారీ చేయాలని…. జీవో నిబంధనల ప్రకారం వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆర్జేడీలు, డిఈఓలను ఆదేశించింది.