పోలవరం-నల్లమల్ల సాగర్ ప్రాజెక్ట్ : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం, అడ్డుకునే దిశగా అడుగులు…
పోలవరం - నల్లమల్ల సాగర్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టులో అభ్యంతరాలు దాఖలు చేయాలని నిర్ణయించింది. మరోవైపు ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో రేపు మధ్యాహ్నం 12 గంటలకు సన్నాహక సమావేశం నిర్వహించనున్నారు.
బనకచర్లపై వెనక్కి తగ్గిన ఏపీ ప్రభుత్వం కొత్తగా పోలవరం - నలమల సాగర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ను తెరపైకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం వేగంగా కసరత్తు చేసే పనిలో ఉంటోంది. ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ…. అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు.

బనకచర్ల ప్రాజెక్ట్ విషయంలోనూ ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య పెద్ద వివాదమే చేలరేగింది. కేంద్ర ప్రభుత్వం తరపున కూడా ఆశించిన స్థాయిలో అనుమతులు రాకపోవటంతో… ఏపీ సర్కార్ వెనక్కి తగ్గింది. డీపీఆర్ లను కూడా రద్దు చేసింది. ఆ వెంటనే పోలవరం -నలమల సాగర్ ప్రాజెక్ట్ ను తెరపైకి తీసుకువచ్చింది.
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం….
ఈ కొత్త ఇరిగేషన్ ప్రాజెక్ట్ విషయంలో ఏపీ సర్కార్ ను అడ్డుకోవాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ఏపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టులో అభ్యంతరాలు దాఖలు చేసేందుకు సిద్ధమైంది. ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో తెలంగాణ తరఫున ప్రాతినిధ్యం వహించాలని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్విని రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థించింది.
ఈనెల 13వ తేదీ పోలవరం-బనకచర్ల సుప్రీంకోర్టు కేసుపై ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో మధ్యాహ్నం 12 గంటలకు సన్నాహక సమావేశం నిర్వహించనున్నారు. 13వ తేదీ మధ్యాహ్నం 2.30 గంటలకు అభిషేక్ మను సింఘ్వితో ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశమవుతారు. ఏపీ సర్కార్ తలపెట్టిన ప్రాజెక్ట్ పై లోతుగా చర్చించనున్నారు. ఆపై న్యాయపోరాటానికి దిగే అవకాశం ఉంది.
ఇక ఇటీవలనే పోలవరం - నలమల సాగర్ డీపీఆర్ రూపకల్పన కోసం టెండర్లను పిలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నల్లమలసాగర్ లింక్ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. అన్ని ఆధారాలతో సుప్రీంకోర్టులో పోరాటం చేయాలని తెలంగాణ సర్కార్ చూస్తోంది.
ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులను త్వరలోనే మొదలు పెట్టాలని ఇటీవలే సీఎం చంద్రబాబు కూడా అధికారులను ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు నుంచి 200 టీఎంసీల గోదావరి వరద జలాలను బొల్లాపల్లి, నల్లమల సాగర్లకు, అలాగే, నాగార్జున సాగర్ నుంచి 50 టీఎంసీల కృష్ణా వరద జలాలను బొల్లాపల్లికి తరలించే యోచన చేయాలని సూచించారు.
ముందుగా ప్రతిపాదించిన గోదావరి - బనకచర్ల ప్రాజెక్ట్ ను మొత్తం రూ.80,112 కోట్లతో ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇందుకోసం జల హారతి కార్పొరేషన్ ఏర్పాటుకు కూడా కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఈ ప్రాజెక్ట్ ను మొత్తం 3 దశల్లో పూర్తి చేయాలని నిర్ణయించింది. పోలవరం కుడి కాల్వ ద్వారా కృష్ణా నదిలోకి…. అక్కడి నుంచి నాగార్జునసాగర్ కుడికాలువ ద్వారా కొత్తగా నిర్మించే బొల్లాపల్లి రిజర్వాయర్లోకి తీసుకోనుంది. అక్కడ్నుంచి బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్కు తరలించాలనేది ఏపీ సర్కార్ ప్లాన్. వీటి కోసమే టెండర్లను ఆహ్వానించింది. కానీ పలువైపుల నుంచి వచ్చిన అభ్యంతరాల నేపథ్యంలో వెనక్కి తగ్గింది.
పోలవరం నుంచి వరద జలాల తరలింపును బనకచర్ల వరకు కాకుండా మధ్యలో నల్లమల సాగర్ వరకే పరిమితం చేయాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. గతంలో ప్రతిపాదించిన ప్రాజెక్టుతో పోల్చితే… ఈ కొత్త అనుసంధానంతో భారీగా వ్యయం తగ్గే అవకాశం ఉంది.














