...
...
Next Story

TG Weather Advisory : తెలంగాణ రైతులకు శుభవార్త - ఇక మీ 'వాట్సాప్'కే వాతావరణ సమాచారం

Telangana Weather Advisory Program : రాష్ట్రంలోని రైతులకు సమయానుకూల వాతావరణ సమాచారం, శాస్త్రీయ వ్యవసాయ సూచనలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం “తెలంగాణ వాతావరణ సలహా కార్యక్రమం”ను ప్రారంభించింది. కృత్రిమ మేధస్సు (AI) ఆధారంగా ఈ వ్యవస్థ పని చేయనుంది.

Published on: May 30, 2026 06:45 PM IST
Advertisement

Telangana Weather Advisory Program : తెలంగాణ రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వాతావరణ మార్పులతో వ్యవసాయ రంగంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించడంతో పాటు ముందస్తు సమాచారాన్ని చేరవేయడానికి సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా “తెలంగాణ వాతావరణ సలహా కార్యక్రమాన్ని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం ప్రారంభించారు.

అన్నదాతలకు గుడ్ న్యూస్ (image by Anuwar hazarika)
అన్నదాతలకు గుడ్ న్యూస్ (image by Anuwar hazarika)

తెలంగాణ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో, ప్రసిద్ధ అంతర్జాతీయ పరిశోధనా సంస్థలైన ‘డెవలప్‌మెంట్ ఇన్నోవేషన్ ల్యాబ్ ఇండియా’ (DIL India), ‘ఎవిడెన్స్ యాక్షన్’ (Evidence Action) ల భాగస్వామ్యంతో ఈ వినూత్న కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ, సదరు సంస్థల ప్రతినిధుల మధ్య తదుపరి కార్యాచరణకు సంబంధించిన అవగాహన ఒప్పందం (MoU) కుదిరింది.

న్యూఢిల్లీ నుంచి జూమ్ (Zoom) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న ఎవిడెన్స్ యాక్షన్ సంస్థ కంట్రీ డైరెక్టర్ అంకుర్ గర్ మాట్లాడారు. రైతులకు మేలు చేసేందుకు తమ సంస్థ కృత్రిమ మేధస్సు (Artificial Intelligence) ఆధారంగా రూపొందించిన ఈ సాంకేతికతను తెలంగాణలో ప్రవేశపెట్టే అవకాశం కల్పించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

వాట్సాప్ ద్వారా వాతావరణ సూచనలు :

ఈ డిజిటల్ విప్లవంలో భాగంగా రైతులకు మండలాల వారీగా వర్షపాతం, ఉష్ణోగ్రతలు, తీవ్రమైన వాతావరణ మార్పుల సమాచారం అందజేస్తారు. వాటికి అనుగుణంగా చేపట్టాల్సిన పంటల సాగు సూచనలను నేరుగా వారి వాట్సాప్ నంబర్లకు సందేశాల రూపంలో చేరవేయనున్నారు.

రాబోయే నైరుతి రుతుపవనాలు, వర్షపాత పరిస్థితులను వివరిస్తూ రూపొందించిన తొలి వాతావరణ ముందస్తు సూచన సందేశాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు స్వయంగా క్లిక్ చేసి వాట్సాప్ ద్వారా రైతులకు పంపించి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్రమోహన్ మాట్లాడుతూ.. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో తెలంగాణ రాష్ట్రం ఎప్పుడూ దేశంలోనే ముందంజలో ఉంటుందని కొనియాడారు.

రాష్ట్రంలోని 'రైతు భరోసా' (Rythu Bharosa) పోర్టల్‌లో ఫోన్ నెంబర్లు నమోదైన 17 జిల్లాలకు చెందిన 304 మండలాల పరిధిలోని సుమారు 15 లక్షల మంది రైతులకు ప్రారంభ దశలో ఈ వాతావరణ సేవలు అందుతాయని ఆయన తెలిపారు.

రాబోయే కాలంలో ఎల్‌నినో (El Nino) వంటి క్లిష్టమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడినప్పుడు, వాటికి తట్టుకుని పంట నష్టాలను తగ్గించుకునేలా రైతులకు ఈ AI ఆధారిత వ్యవస్థ ఖచ్చితమైన సమాచారాన్ని అందిస్తుంది. ఇది ‘తెలంగాణ రైజింగ్–2047’ లక్ష్యాల సాధనకు ఎంతగానో తోడ్పడుతుందని సురేంద్రమోహన్ వివరించారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe