33 జిల్లాలు, 119 నియోజకవర్గాలు - కవిత 'జనం బాట' యాత్ర ప్రారంభం..!
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత జనం జాగృతి బాట యాత్ర శనివారం నుంచి షురూ అయింది. ముందుగా గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపానికి కవిత నివాళులర్పించారు. ఆ తర్వాత నిజామాబాద్ నుంచి యాత్రను ప్రారంభించారు.
మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత నిజామాబాద్ నుంచి 'జాగృతి జనం బాటా' (పాదయాత్ర)ను ప్రారంభించారు. ఈ యాత్రలో పెద్ద ఎత్తున జాగృతి కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 జిల్లాలు… 119 నియోజకవర్గాల్లో ఈ యాత్ర జరగనుంది.

'జనం బాట' కార్యక్రమానికి నిజామాబాద్ బయలుదేరే ముందు గన్ పార్క్ వద్ద కవిత అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ…. “తెలంగాణ ఉద్యమంలో అనేక మంది అమరులయ్యారు. వారి త్యాగాలతో తెలంగాణ సాధించుకున్నాం. ఏ ఆశయాల కోసం వారు అమరులయ్యారో వాటిని ఎంత వరకు సాధించుకున్నామో ఆలోచించుకోవాలి. పేగులు తెగేదాక కొట్లాడిన ఉద్యమ కారుల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో కూడా ఆలోచించుకోవాలి. తెలంగాణ కోసం 1200 మంది అమరులయ్యారని మనమే అసెంబ్లీ లో చెప్పాం. కాని వారికి ఇవ్వాల్సిన గౌరవం, వారి కుటుంబాలకు ఇవ్వాల్సినంత గౌరవం ఇవ్వలేదు” అని వ్యాఖ్యానించారు.
“33 జిల్లాలు 119 నియోజకవర్గాల్లో 'జనం బాట' పేరుతో జనం కోసం బయలుదేరుతున్నా. మీరు కూడా వచ్చేయండి. అందరం కలిసి పోరాటం చేద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇస్తామని హామీ ఇచ్చింది. ఆ హామీ నెరవేరే వరకు ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాల్సిందే. ఉద్యమకారుల పోరాటం కారణంగానే తెలంగాణ వచ్చింది. అందరం బాగుండాలనే తెలంగాణ తెచ్చుకున్నాం.అందరు బాగుండాలంటే సామాజిక తెలంగాణ రావాలి” అని కవిత అన్నారు.
“ఇవాళ ఉన్న ప్రభుత్వానికి అసలు తెలంగాణ సోయి లేదు. తెలంగాణ తల్లి చేతుల్లోంచి బతుకమ్మను తీసేయటం మన గుండెల్ని మెలి పెట్టినట్లైంది. మళ్లీ తెలంగాణ తల్లి చేతుల్లోకి బతుకమ్మ వచ్చే వరకు పోరాటం చేద్దాం. తెలంగాణలోని చాలా ప్రాంతాలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. మరోసారి అమరవీరులకు, వారి కుటుంబాలకు నా తరఫున క్షమాపణలు చెబుతున్నా. వారికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తా. తెలంగాణ సోయి లేని ఈ ప్రభుత్వంపై జంగ్ సైరన్ పూరించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరూ ఈ పోరాటంలో కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తున్నా” అని కవిత పిలుపునిచ్చారు.
నిజామాబాద్ నుంచి యాత్రను ప్రారంభించిన సందర్భంగా తెలంగాణ జాగృతి కార్యాలయంలో కవిత మరోసారి మాట్లాడారు. “నిజామాబాద్ లో నా ఓటమి ఓ కుట్రనా? కాదా? నిజామాబాద్ బీఆర్ఎస్ కార్యకర్తలు ఆలోచించాలి. 20 ఏళ్లుగా కేసీఆర్, టీఆర్ఎస్, బీఆర్ఎస్ కోసం పనిచేశా.ఇంటి గుట్టు బయట పెట్టి... కుట్ర చేసి నన్ను బయటకి పంపించారు. ఇప్పుడు నా దారి నేను వెతుక్కుంటున్నా.ఈ జిల్లా బిడ్డగా, కోడలిగా మీ ఆశీర్వాదం కోసం వచ్చా” అని కవిత కామెంట్స్ చేశారు.
నిజానికి బీఆర్ఎస్ కు దూరమైన వెంటనే కవిత కొత్త పార్టీని ప్రకటిస్తారని అంతా భావించారు. కానీ అలాంటి ఆలోచన ఏం లేదని కవిత స్పష్టం చేస్తూ వచ్చారు. కానీ జాగృతి ద్వారా అంశాల వారీగా కార్యక్రమాలు చేస్తున్నారు. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్లతో పాటు నిరుద్యోగుల అంశాలపై ప్రధానంగా పోరాడుతూ వచ్చారు. భవిష్యత్తులో మరికొన్ని కార్యక్రమాలను చేపట్టే యోచనలో కూడా కవిత ఉన్నారు.
పార్టీపై ప్రకటన ఉంటుందా…?
బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ కు గురైన కవిత… తెలంగాణ జాగృతిని బలోపేతం చేసే పనిలో పడ్డారు. విభాగాల వారీగా కమిటీలను కూడా ప్రకటిస్తున్నారు. సందర్భాన్ని, సమయాన్ని బట్టి గత, ప్రస్తుత ప్రభుత్వాలపై ప్రశ్నలను సంధిస్తున్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే తమకు మొదటి ప్రాధాన్యత అంశమని కవిత పదే పదే చెబుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా యాత్రకు నడుంబిగించారు.
ఈ యాత్ర ద్వారా ప్రజల్లోకి జాగృతిని మరింత బలంగా తీసుకెళ్లాలని కవిత భావిస్తున్నారని తెలుస్తోంది. గ్రౌండ్ లోని పరిస్థితులతో పాటు ప్రజల నుంచి వచ్చే స్పందనను బట్టి పార్టీ ఏర్పాటుపై కవిత నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్న విశ్లేషణలు, అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ యాత్ర ఫిబ్రవరిలో ముగుస్తుంది కాబట్టి... ఆ తర్వాత కవిత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది టాక్ ఆఫ్ ది పాలిటిక్స్ గా మారింది...!
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

