జనసేనకు షాక్ - హైదరాబాద్‌లో పవన్‌ సభకు అనుమతి నిరాకరణ..!

Janasena Party Nava Nirmana Sankalpa Sabha : హైదరాబాద్ నగరంలో జూన్ 2న నిర్వహించ తలపెట్టిన పవన్ కల్యాణ్ ‘తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ - జనసేన సాధక్‌ సమ్మేళనం’ సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో జనసేన తెలంగాణ నేతలు న్యాయపోరాటానికి దిగుతూ హైకోర్టును ఆశ్రయించారు.

Published on: Jun 1, 2026, 19:25:05 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Janasena Party Nava Nirmana Sankalpa Sabha : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ హైదరాబాద్ నగరంలో జూన్ 2వ తేదీన తలపెట్టిన ‘తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ - జనసేన సాధక్‌ సమ్మేళనం’ సమావేశానికి చుక్కెదురైంది. ఈ సభకు నగర పోలీసులు అనుమతి నిరాకరించారు.

జనసేన అధినేత పవన్ (ఫైల్ ఫొటో)
జనసేన అధినేత పవన్ (ఫైల్ ఫొటో)

జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అధికారికంగా జరగనున్న నేపథ్యంలో నగరంలో శాంతిభద్రతల (Law & Order) పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసుల నుంచి అనుమతి రాకపోవడంతో తెలంగాణ జనసేన ముఖ్య నాయకులు తక్షణమే స్పందిస్తూ హైకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం.

పోలీసుల నిర్ణయంపై జనసేన పార్టీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తాము బహిరంగంగా ఎలాంటి భారీ సభను నిర్వహించడం లేదని…. ఇండోర్ కన్వెన్షన్ సెంటర్లలో పార్టీ కార్యకర్తలు, నాయకులతో కేవలం 'ఆత్మీయ సాధక్ సమావేశం' మాత్రమే ఏర్పాటు చేసుకుంటున్నామని చెబుతున్నారు. హాలులో లేదా కన్వెన్షన్ సెంటర్‌లో అంతర్గతంగా నిర్వహించుకునే ఇలాంటి సమావేశాలకు పోలీసులకు కేవలం ముందస్తు సమాచారం ఇస్తే సరిపోతుందని….. దీనికి ప్రత్యేకంగా పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు.

నిరాకరించడం సహేతుకం కాదు - జనసేన పార్టీ ప్రకటన

అనుమతి నిరాకరణపై జనసేన పార్టీ స్పందించింది. ఈ మేరకు ఓ ప్రకటనను కూడా విడుదల చేసింది.

"తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని 2000 మంది జనసేన సాధక్ లతో ఒక ఇండోర్ కార్యక్రమం నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. తెలంగాణ రాష్ట్ర నాయకులు, తెలంగాణ రాష్ట్రానికి చెందిన జనసేన క్రియాశీలక కార్యకర్తలతో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాడు పార్టీ భవిష్యత్ కార్యాచరణ, రాష్ట్ర అభివృద్ధిలో జనసేన పోషించాల్సిన పాత్ర, జనసేన పార్టీ బలోపేతానికి సంబంధించి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసుకునే కార్యక్రమానికి అనుమతి నిరాకరించడం అర్థరహితం. ప్రొఫెసర్ కె నాగేశ్వర్ వ్యాఖ్యలను ఆయనే ఉపసంహరించుకున్నారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున కూడా చర్యలు ఉండవు అని పవన్ కళ్యాణ్ ప్రజాముఖంగానే తెలిపారు. గచ్చిబౌలి సంధ్య కన్వెన్షన్ హాల్ లో నిత్యం ఎన్నో సాంస్కృతిక, రాజకీయ, కార్పొరేట్ కంపెనీల సమావేశాలు జరుగుతూనే ఉంటాయి. అప్పుడు ఎప్పుడూ రాని పార్కింగ్ సమస్య జనసేన పార్టీ కార్యక్రమానికి అడ్డంకిగా చూపి నిరాకరించడం సహేతుకం కాదు" అని జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది.

ఎలాంటి సరైన, బలమైన కారణాలు చూపకుండానే పోలీసులు కావాలనే తమ సమావేశానికి అనుమతి నిరాకరించారని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. జూన్ 2న జరగాల్సిన ఈ సాధక్ సమ్మేళనానికి అధినేత పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరై తెలంగాణలో పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై దిశా నిర్దేశం చేయాల్సి ఉంది. ఈ క్రమంలో పోలీసుల అభ్యంతరాలను సవాల్ చేస్తూ…. సమావేశ నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని కోరుతూ జనసేన నాయకులు అత్యవసరంగా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు తీర్పు ఆధారంగానే రేపటి పవన్ కల్యాణ్ పర్యటన. సమావేశంపై స్పష్టత రానుంది.

మరోవైపు పవన్ హైదరాబాద్ సభ నేపథ్యంలో… తెలంగాణ నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటును జీర్ణించుకోలేని వ్యక్తి… ఎలా సభ పెడుతున్నారని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ప్రజలను దిష్టితో పోల్చారని… అలాంటి పవన్ తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More