2025-26 ఖరీఫ్ సీజన్లో రైతుల నుంచి రికార్డు స్థాయిలో 70.82 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు తెలంగాణ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) కార్యకలాపాల ద్వారా 13.97 లక్షల మంది రైతులకు నేరుగా లబ్ధి చేకూరిందని వివరించారు.
- రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం…. గతంలో కొనుగోలు చేసిన 70.2 లక్షల మెట్రిక్ టన్నుల రికార్డును ఈ ఖరీఫ్ సీజన్లో అధిగమించారు.
- ప్రభుత్వం కొనుగోలు చేసిన 70.82 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంలో 32.45 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దొడ్డు రకం ఉంది.
- 38.37 లక్షల మెట్రిక్ టన్నులు సన్నాలు ఉన్నాయి.
- రాష్ట్రవ్యాప్తంగా 13.97 లక్షల మంది రైతులకు మద్దతు ధర అందించారు.

సేకరించిన ధాన్యం మొత్తం ఎంఎస్పీ విలువ రూ .16,912 కోట్లకు పైగా ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే రైతులకు రూ .16,602 కోట్లు అందజేశామని చేశామని…. 98 శాతం చెల్లింపు ప్రక్రియ పూర్తి అయిందని పేర్కొన్నారు.
రైతులకు అండగా ఉండేందుకు మొత్తం రూ .1,425 కోట్ల బోనస్ చెల్లింపులు అందించబడ్డాయని మంత్రి ఉత్తమ్ వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 8,448 కొనుగోలు కేంద్రాలను తెరవడం ద్వారా ధాన్యం సేకరణ సులభతరమైందని వివరించారు.
ధాన్యం కొనుగోలు ప్రక్రియలో పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖల సమన్వయం, తెలంగాణ రైతాంగ భాగస్వామ్యంతోనే ఈ రికార్డు సాధ్యమైందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు. రాబోయే రోజుల్లోనూ ఇదే మాదిరిగా సమన్వయంతో పని చేసి రైతులకు అండగా నిలవాలని ఆకాంక్షించారు.