TG Rythu Bharosa Scheme : ఇవాళే రైతు భరోసా నిధులు విడుదల - దశలవారీగా రైతుల ఖాతాల్లోకి డబ్బుల జమ

Telangana Rythu Bharosa Scheme : వానాకాలం సీజన్ రైతు భరోసా నిధులు ఇవాళ విడుదల కానున్నాయి. తొలి విడతగా రెండు ఎకరాలలోపు ఉన్న 41.37 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2,482.02 కోట్లను జమ చేస్తారు. హైదరాబాద్ శిల్పకళా వేదికగా ఈ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు.

Published on: Jun 30, 2026, 06:58:25 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Telangana Rythu Bharosa Scheme: రాష్ట్రంలోని అన్నదాతలకు పంట పెట్టుబడి సాయంగా అందించే రైతు భరోసా వానాకాలం సీజన్‌ నిధులు మంగళవారం(ఇవాళ) విడుదల కానున్నాయి సాయంత్రం నుంచే రైతుల బ్యాంక్ ఖాతాల్లో ఈ డబ్బులు జమ కానున్నాయి. మొదటి విడత కింద రెండు ఎకరాల వరకు భూమి ఉన్న 41.37 లక్షల మంది రైతులకు ఈ లబ్ధి చేకూరనుంది. ఇందుకోసం ప్రభుత్వం రూ.2,482.02 కోట్లను సిద్ధం చేసింది.

రైతు భరోసా స్కీమ్
రైతు భరోసా స్కీమ్

హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో సాయంత్రం నాలుగు గంటలకు నిర్వహించే 'రైతు ఆశీర్వాద సభ' ఇందుకు వేదిక కానుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ల్యాప్‌ట్యాప్‌లో మీట నొక్కి నేరుగా రైతుల ఖాతాల్లోకి నిధులను బదిలీ చేస్తారు.

ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం……. ఈ రైతు ఆశీర్వాద సభను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర శాసనసభ నియోజకవర్గ పరిధిలోని చింతకానిలో నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. అయితే రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అక్కడ సభ నిర్వహణ సాధ్యపడలేదు. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికకు మార్చారు.

ఈ సీజన్‌లో ఎకరానికి రూ.ఆరు వేల చొప్పున.. మొత్తం 73.32 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం అందుతుందని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కోటిన్నర ఎకరాలకు గానూ మొత్తం రూ.9 వేల కోట్లను దశలవారీగా విడుదల చేస్తారు. ఇందులో భాగంగానే తొలి విడతలో రెండు ఎకరాల లోపు ఉన్న 41.37 లక్షల మంది చిన్న, సన్నకారు రైతుల ఖాతాల్లో రూ.2,482.02 కోట్లు జమవుతాయి.

కొత్త పట్టాదారులకు కూడా ఛాన్స్…!

మరోవైపు రాష్ట్రంలోని కొత్త పట్టాదారులకు వ్యవసాయ శాఖ అలర్ట్ ఇచ్చింది. ఈ నెల 15వ తేదీ వరకు కొత్తగా వ్యవసాయ భూములను కొనుగోలు చేసి, పట్టాదారు పాస్‌పుస్తకాలు పొందిన రైతులందరూ రైతు భరోసా పథకానికి అర్హులని స్పష్టం చేసింది. ఈ మేరకు కొత్తగా పాస్‌పుస్తకాలు అందుకున్న రైతులు వెంటనే తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించింది.

కొత్తగా పట్టాదారు పాస్‌పుస్తకాలు పొందిన రైతులు తమ పరిధిలోని వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈవో)ని లేదా మండల వ్యవసాయ అధికారి (ఎంఏవో)ని కలిసి తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. పాస్‌పుస్తకం ప్రతి, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలతో అధికారులను సంప్రదించి, గడువు(జూలై 5) ముగిసేలోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ కోరింది. కొత్త రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులు స్పష్టం చేశారు.

రైతు భరోసా పథకం కింద ఎకరాకు ఏడాదికి రూ. 12,000 చొప్పున పెట్టుబడి సాయం లభిస్తుంది. ఈ మొత్తం రెండు దఫాలుగా ప్రభుత్వం ఇస్తుంది. ప్రతి విడతలో రూ. 6,000 చొప్పున రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయి. ఖరీఫ్, రబీ సీజన్ ల కోసం రైతులకు ఈ పంట పెట్టుబడి సాయం అందుతుంది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More