TG EAPCET Counseling 2026 : టీజీ ఎప్సెట్ అభ్యర్థులకు అప్డేట్ - నేటితో స్లాట్ బుకింగ్ క్లోజ్..!
TG EAPCET Counseling 2026 : టీజీ ఎప్సెట్ (TG EAPCET) ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ కొనసాగుతోంది. ప్రవేశాల కోసం స్లాట్ బుకింగ్ చేసుకునే గడువు నేటితో ముగుస్తుంది.
TG EAPCET Counseling 2026 : ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తోన్న టీజీ ఎప్సెట్ (TG EAPCET) కౌన్సెలింగ్ ప్రక్రియ వేగంగా సాగుతోంది. మొదటి విడత కౌన్సెలింగ్కు సంబంధించిన స్లాట్ బుకింగ్ ప్రక్రియ సోమవారంతో (జూన్ 29) ముగియనుందని ప్రవేశాల కన్వీనర్ శ్రీదేవసేన ఆదివారం ఒక అధికారిక ప్రకటనలో వెల్లడించారు.

ఆదివారం నాటికే రాష్ట్రవ్యాప్తంగా సుమారు 92 వేల మంది విద్యార్థులు తమ స్లాట్లను బుక్ చేసుకున్నారు. స్లాట్ బుకింగ్ విజయవంతంగా పూర్తి చేసుకొని, ధ్రువపత్రాల పరిశీలన ముగిసిన అభ్యర్థులు మాత్రమే వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవడానికి అర్హులవుతారని అధికారులు స్పష్టం చేశారు.
సర్టిఫికెట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్ల షెడ్యూల్
స్లాట్ బుక్ చేసుకున్న విద్యార్థులు జూన్ 29 లోపు తమకు కేటాయించిన, నిర్దేశిత హెల్ప్లైన్ కేంద్రాలకు (HLC) సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం వ్యక్తిగతంగా హాజరుకావాల్సి ఉంటుంది.
ధ్రువపత్రాల పరిశీలన విజయవంతంగా పూర్తయిన విద్యార్థులు.. జులై 1వ తేదీ వరకు తమకు ఆసక్తి ఉన్న ఇంజినీరింగ్ కళాశాలలు, కోర్సులను ప్రాధాన్యతా క్రమంలో ఎంచుకుంటూ వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చు.
వెబ్ ఆప్షన్ల నమోదుపై విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు పూర్తి అవగాహన కల్పించేందుకు సాంకేతిక విద్యాశాఖ ఒక వినూత్న నిర్ణయం తీసుకుంది. జులై 4వ తేదీ లోపు 'మాక్ కౌన్సెలింగ్' నిర్వహించి, దాని ద్వారా సీట్ల కేటాయింపు ప్రక్రియ ఎలా ఉంటుందో ప్రయోగాత్మకంగా చూపిస్తారు.
ఈ మాక్ కౌన్సెలింగ్ ద్వారా సీటు కేటాయింపు విధానంపై స్పష్టత వచ్చాక, విద్యార్థులు అవసరమైతే జులై 5 నుండి 7వ తేదీ వరకు తమ వెబ్ ఆప్షన్లలో మార్పులు లేదా చేర్పులు చేసుకోవడానికి అవకాశం కల్పించారు.
ఒకవేళ నిర్ణీత గడువులోగా ఎలాంటి మార్పులు చేయని పక్షంలో, మాక్ కౌన్సెలింగ్ సమయంలో ఉంచిన ఆప్షన్లనే తుది ఆప్షన్లుగా సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా పరిగణిస్తుంది. అనంతరం జులై 10వ తేదీ లోపు మొదటి విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపును అధికారులు అధికారికంగా ప్రకటిస్తారు.
టీజీ ఎప్సెట్ (TG EAPCET) కౌన్సెలింగ్ — ముఖ్యమైన తేదీలు:
- జూన్ 28 వరకు - కౌన్సెలింగ్ ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, స్లాట్ బుకింగ్.
- జూన్ 29 వరకు - హెల్ప్లైన్ కేంద్రాలలో ఒరిజినల్ ధ్రువపత్రాల పరిశీలన.
- జులై 1 వరకు - నచ్చిన కోర్సులు, కళాశాలల వెబ్ ఆప్షన్ల నమోదు.
- జులై 4వ తేదీ లోపు: మాక్ కౌన్సెలింగ్ విధానంలో సీట్ల కేటాయింపు పరిశీలన.
- జులై 5 - 7 వరకు: వెబ్ ఆప్షన్లలో మార్పులు చేసుకునేందుకు చివరి అవకాశం (మార్చకపోతే పాత ఆప్షన్లే ఫైనల్ అవుతాయి).
- జులై 10 లోపు: మొదటి విడత ఇంజినీరింగ్ సీట్ల అధికారిక కేటాయింపు.
స్లాట్ బుకింగ్ చేసుకునే విధానం:
- విద్యార్థులు మొదటగా అధికారిక వెబ్సైట్ tgeapcet.nic.in ఓపెన్ చేయాలి.
- హోంపేజీలో కనిపించే లింక్ ద్వారా మొదటగా ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి.
- ఫీజు చెల్లింపు పూర్తయిన తర్వాత 'స్లాట్ బుకింగ్' ఆప్షన్ క్లిక్ చేయాలి.
- ఇక్కడ మీ ఎప్సెట్ హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్ మరియు పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి.
- స్క్రీన్పై వచ్చే వివరాలన్నీ సరిచూసుకున్న తర్వాత సబ్మిట్ బటన్ నొక్కితే మీ స్లాట్ బుకింగ్ పూర్తవుతుంది.
జులై 17 నుంచి రెండో విడత కౌన్సెలింగ్
మొదటి విడత సీట్ల కేటాయింపు ముగిసిన అనంతరం….. జులై 17వ తేదీ నుండి రెండో విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. జులై 18న సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ నిర్వహించనుండగా, జులై 18, 19 తేదీల్లో విద్యార్థులు రెండో విడత వెబ్ ఆప్షన్లను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ మొత్తాన్ని కూడా విద్యార్థులు పైన పేర్కొన్న అధికారిక వెబ్సైట్ ద్వారానే పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

