ప్రజాప్రతినిధుల జీతాల్లో 50 శాతం కట్.. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు సర్దుబాటు!

Telangana Cabinet Decisions : తెలంగాణ కేబినెట్‌ భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. ఇందులో భాగంగా పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు సర్దుబాటు చేయడంపై ముఖ్యంగా చర్చించారు మంత్రులు.

Published on: Apr 24, 2026, 05:52:10 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మెను విరమించాలని రాష్ట్ర మంత్రిమండలి విజ్ఞప్తి చేసింది. చర్చల ద్వారా కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని తెలియజేసింది. చర్చలకు రావాలని కార్మిక సంఘాలను ఆహ్వానించింది.

సీఎం రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశం ఆర్టీసీ కార్మికుల సమ్మెపై సుదీర్ఘంగా చర్చించింది. కార్మికుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని, కార్మిక సంఘాలతో చర్చలు జరపాలని సమావేశంలో ముఖ్యమంత్రి సూచించారు.

కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు తీర్పు విషయాన్ని మంత్రివర్గ సమావేశం చర్చించింది. జ్యుడీషియల్ కమిషన్ నియామకాన్ని హైకోర్టు తప్పుబట్టలేదని, పైగా కమిషన్ ఏర్పాటు చట్టబద్ధమని, రాజ్యాంగబద్ధమని కూడా అభిప్రాయపడిందని సమావేశంలో అడ్వకేట్ జనరల్ తీర్పు వివరాలను వెల్లడించారు. ఆ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని దీనిపై న్యాయనిపుణులతో చర్చించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకోవాలని మంత్రివర్గం నిర్ణయించింది.

పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు సంబంధించి ప్రయోజనాలను అందించే అంశంపైన కేబినెట్‌లో మాట్లాడారు. రెగ్యులర్ ఉద్యోగులకు సంబంధించి రూ. 6,200 కోట్లు, రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన రూ. 8 వేల కోట్లు పెండింగ్‌లో ఉండగా, ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించి అవసరమైన నిధులను సర్దుబాటు చేయాలని నిర్ణయించారు.

ఆర్థిక వనరుల సమీకరణలో భాగంగా ప్రజాప్రతినిధుల జీతాల్లో 50 శాతం తగ్గించి పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు సర్దుబాటు చేయడం వంటి చర్యలు చేపట్టాలన్న ప్రతిపాదనపై మంత్రులంతా ఉదారంగా ముందుకొచ్చి తమ ఆమోదం తెలిపారు.

అలాగే, రిసోర్స్ మొబిలైజేషన్ కోసం నియమించిన సబ్ కమిటీ వెంటనే ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, రిటైర్డ్ ఉద్యోగ సంఘాలను పిలిచి చర్చలు జరపాలని, ఆర్థిక వనరుల సమీకరణతో పాటు వీలైనంత తొందరగా సమస్యను పరిష్కరించాలని నిర్ణయించారు.

హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియాన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్‌ పద్ధతిలో అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. స్టేడియాన్ని ప్రస్తుతం అందుబాటులో ఉన్న 76 ఎకరాల్లో 64 ఎకరాల్లో అత్యాధునిక సౌకర్యాలతో 21 రకాల క్రీడలకు సంబంధించిన సౌకర్యాలను కల్పించాలని నిర్ణయించారు.

మంథని నియోజకవర్గ ప్రాంత ప్రజల చిరకాల కోరిక అయిన చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణ ప్రక్రియను పూర్తి చేయాలని మంత్రివర్గం తీర్మానించింది. అలాగే మంచిర్యాల జిల్లా హాజీపూర్ రెవెన్యూ పరిధిలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పరిసరాల్లో ఇంటిగ్రేటెడ్ అక్వా పార్క్‌ను ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More