TGSPDCL Services : టీజీఎస్పీడీసీఎల్ పరిధిలోని విద్యుత్ వినియోగదారులకు భారీ ఊరట లభించనుంది. క్షేత్రస్థాయిలో చేపట్టే చిన్న చిన్న పనుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా విద్యుత్ శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది.

డివిజనల్ ఇంజినీర్ (DE), సూపరింటెండెంట్ ఇంజనీర్ (SE), చీఫ్ ఇంజనీర్ (CE)లకు పనుల మంజూరు అధికార పరిమితిని పెంచుతూ సంస్థ సీఎండీ ముషారఫ్ అలీ ఫారూఖీ (గతంలో జీతేష్ వి పాటిల్ సమీక్షించిన ప్రతిపాదనల మేరకు) ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయం వల్ల వినియోగదారులకు నాణ్యమైన సేవలు మరింత వేగంగా అందనున్నాయి.
స్థానిక స్థాయిలోనే నిధుల మంజూరు….
గతంలో డివిజన్ స్థాయిలో పనుల మంజూరు పరిమితి కేవలం రూ. 2 లక్షలు మాత్రమే ఉండేది. దీనిని ఇప్పుడు ఏకంగా రూ. 10 లక్షలకు పెంచారు. అంతేకాకుండా…. సూపరింటెండెంట్ ఇంజనీర్ (SE) పరిమితిని రూ. 5 లక్షల నుంచి రూ. 25 లక్షలకు, చీఫ్ ఇంజినీర్ (CE) పరిమితిని రూ. 10 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకు పెంచారు. ఈ నిధుల పెంపుతో ఎస్టిమేషన్ల మంజూరు, కొత్త విద్యుత్ లైన్ల ఏర్పాటు, ఇతర సాంకేతిక పనులు వేగంగా పూర్తవుతాయి. సుదూర ప్రాంతాల నుంచి హైదరాబాద్లోని ప్రధాన కార్యాలయానికి రావాల్సిన తిప్పలు వినియోగదారులకు తప్పనున్నాయి.
సమయం, వృథా ఖర్చులకు అడ్డుకట్ట
గతంలో చిన్న పనుల మంజూరుకైనా ఉన్నతాధికారుల అనుమతి కోసం ఫైళ్లు నెలల తరబడి పెండింగ్లో ఉండేవి. నిధులు ఉన్నా సాంకేతిక అనుమతుల పరిమితి తక్కువగా ఉండటం వల్ల క్షేత్రస్థాయిలో పనులు ఆలస్యమయ్యేవి. కానీ తాజా నిర్ణయంతో 80 శాతం పనులు ఎస్ఈ (SE) పరిధిలోనే ముగిసిపోతాయి. 11 కేవీ సర్వీసుల ఎస్టిమేషన్లు, అగ్రిమెంట్లు, కొత్త ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు వంటి పనులన్నీ జోన్ స్థాయిలోనే పూర్తవుతాయి.
సివిల్ పనుల్లో సైతం ఎస్టిమేషన్ల పరిమితిని పెంచడం వల్ల వినియోగదారులకు సమయం ఆదా అవ్వడంతో పాటు సంస్థలో పారదర్శకత పెరుగుతుందని కాంట్రాక్టర్లు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పెరుగుతున్న ధరల రిత్యా అంచనా వ్యయం పెరిగినా…. స్థానిక అధికారులకే అధికారాలు ఉండటం వల్ల పనుల్లో జాప్యం పూర్తిగా తొలగిపోనున్నాయి.