TGSRTC : భక్తుల ఇంటికే భద్రాద్రి రాములోరి కల్యాణ తలంబ్రాలు - రూ. 151కే బుకింగ్...!

శ్రీరామనవమి వేళ భద్రాచలంలో నిర్వహించే శ్రీ సీతారామచంద్రుల కల్యాణోత్సవ తలంబ్రాలను భక్తులకు అందించాలని  ఆర్టీసీ నిర్ణయించింది. ఆర్టీసీ లాజిస్టిక్స్‌ కేంద్రాల్లో రూ.151 చెల్లించి వివరాలు నమోదు చేసుకోవాలని సూచించింది.

Published on: Feb 22, 2026 8:21 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

శ్రీరామనవమి వేళ భద్రాచలంలో నిర్వహించే శ్రీ సీతారామచంద్రుల కల్యాణోత్సవ తలంబ్రాలను భక్తులకు అందించాలని ఆర్టీసీ నిర్ణయించింది. మార్చి 27న శ్రీసీతారామచంద్రుల కల్యాణోత్సవం అనంతరం తలంబ్రాలను… హోం డెలివరీ చేయనుంది. ఆర్టీసీ లాజిస్టిక్స్‌ కేంద్రాల్లో రూ.151 చెల్లించి వివరాలు నమోదు చేసుకోవాలని సూచించింది.

భద్రాద్రి రాములోరి కల్యాణ తలంబ్రాలు
భద్రాద్రి రాములోరి కల్యాణ తలంబ్రాలు

ఈనెల 23 నుంచి బుకింగ్స్…

ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను శనివారం ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి ఆవిష్కరించారు. కేవలం రూ.151 చెల్లించడం ద్వారా స్వామి వారి కళ్యాణ తలంబ్రాలను భక్తులు తమ ఇంటి వద్దే పొందవచ్చని ఆయన తెలిపారు. ఈ-సేవల కోసం భక్తులు ముందస్తుగా… ఫిబ్రవరి 23వ తేదీ నుంచి వెబ్ సైట్ (http://tgsrtclogistics.co.in) ద్వారా సమీపంలోని టీజీఎస్‌ఆర్‌టీసీ లాజిస్టిక్స్‌కౌంటర్లలో బుక్ చేసుకోవాల్సి ఉంటుందని సూచించారు. మరింత సమాచారం కోసం 040-69440069, 040-23450033 నెంబర్లను సంప్రదించవచ్చని పేర్కొన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో శ్రీరామనవమి వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతాయి. అయితే భద్రాద్రిలో జరిగే వేడుకలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. శ్రీ సీతారాముల కల్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. కల్యాణతంతును చూసేందుకు లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు.

ప్రభుత్వం తరుపున మంత్రులు స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పిస్తారు. కల్యాణ మహోత్సవం జరిగిన తర్వాత రోజు రామయ్యకు మహాపట్టాభిషేకం నిర్వహించడం ఆనవాయితీ. ఇక్కడ జరిగే వేడుకల కోసం ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా నిధులు విడుదల చేస్తుంది.

శ్రీ సీతారాముల కల్యాణాన్ని చూసేందుకు తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు భద్రాచలం చేరుకుని.. స్వామివారి కళ్యాణాన్ని తిలకించి అనుగ్రహాన్ని పొందుతారు. ఇక రకరకాల కారణాల వల్ల చాలా మంది భక్తులు భద్రాచలం రాలేకపోతారు. అయితే అలాంటి భక్తుల కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ( టీజీఎస్ ఆర్టీసీ ) గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతోంది. భద్రాచలం రాములోరి కళ్యాణ తలంబ్రాలను.. నేరుగా బుక్ చేసుకున్న వారి ఇంటి వద్దకే చేరవేస్తోంది. ఇందులో భాగంగానే ఈ ఏడాది కూడా బుకింగ్ సౌకర్యాన్ని ప్రారంభించింది.