భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో నిర్వహించిన శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్ల ఈ మహోత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టు వస్త్రాలు సమర్పించారు.
మార్మోగిన రామనామం…

వేద మంత్రోచ్చారణల మధ్య సంప్రదాయబద్ధంగా నిర్వహించిన పట్టాభిషేక వేడుకలు భక్తులను ఆకట్టుకున్నాయి. దేశ నలుమూలల నుంచి భారీగా తరలి వచ్చిన భక్తులతో మిథిలా ప్రాంగణం రామనామ స్మరణలతో మార్మోగింది. వసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే వెంకట్రావు దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు ఈ ఉత్సవాన్ని తిలకించారు.
జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ…. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అన్ని శాఖల సమన్వయంతో తాగునీరు, ప్రసాదాలు, వైద్య సదుపాయాలు, భద్రత వంటి అన్ని ఏర్పాట్లు సమగ్రంగా చేపట్టినట్లు తెలిపారు.
గిరి మార్ట్ ప్రారంభం:
భద్రాచలంలో ఐటీడీఏ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన గిరి మార్ట్ను రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్ల సతీసమేతంగా ప్రారంభించారు. గిరిజనుల ఆర్థికాభివృద్ధి, వారి ఉత్పత్తులకు స్థిరమైన మార్కెట్ కల్పించడం లక్ష్యంగా ఈ గిరి మార్ట్ను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
గిరి మార్ట్లో అడవి ఉత్పత్తులు, సేంద్రీయ ఆహార పదార్థాలు, గిరిజన హస్తకళా వస్తువులను ఒకే వేదికపై విక్రయానికి అందుబాటులో ఉంచారు. దీనివల్ల గిరిజనులకు నేరుగా ఆదాయం లభించి, మధ్యవర్తుల ప్రభావం తగ్గుతుందని తెలిపారు.
అనంతరం గవర్నర్ గిరి మార్ట్లో ఉంచిన ఉత్పత్తులను పరిశీలించారు. వాటి ప్రత్యేకతలు, తయారీ విధానం, మార్కెటింగ్ సదుపాయాల గురించి జిల్లా కలెక్టర్ అంకిత్ గారిని అడిగి తెలుసుకున్నారు. గిరిజన కళలు, ఉత్పత్తులకు ఇది మంచి ప్రోత్సాహక వేదికగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.