యూపీఎస్సీ సివిల్స్ మెయిన్స్ ఫలితాలు.. తెలంగాణ నుంచి ఇంటర్వ్యూకి ఎంతమంది ఎంపిక అయ్యారంటే?
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఫలితాలు విడుదల అయ్యాయి. ఇందులో తెలంగాణ నుంచి ఇంటర్వ్యూకి ఎంత మంది ఎంపిక అయ్యారు అంటే..?
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్ష ఫలితాలు 2025ను విడుదల చేసింది. సివిల్ సర్వీసెస్ (మెయిన్) పరీక్ష, 2025కు హాజరైన అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్ upsc.gov.in ద్వారా ఫలితాన్ని చెక్ చేయవచ్చు.

మెయిన్ పరీక్ష ఆగస్టు 22 నుండి ఆగస్టు 31, 2025 వరకు జరిగింది. ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ ఫారిన్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇతర కేంద్ర సర్వీసులకు (గ్రూప్ 'ఎ' మరియు గ్రూప్ 'బి') ఎంపిక కోసం పర్సనాలిటీ టెస్ట్ (ఇంటర్వ్యూ)కి పిలుస్తారు. 2736 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూకు ఎంపికయ్యారు.
ఈ అభ్యర్థులకు పర్సనాలిటీ టెస్ట్ (ఇంటర్వ్యూ) తేదీలను ప్రకటిస్తారు, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం, ధోల్పూర్ హౌస్, షాజహాన్ రోడ్, న్యూఢిల్లీ-110069లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఇంటర్వ్యూకి పిలిచే అభ్యర్థులు వారి అన్ని ఒరిజినల్ పత్రాలను తమతో తీసుకురావాలి. ధృవీకరణ కోసం ఈ పత్రాలు అవసరం.
ఎంపికైనవారికి లక్ష ఆర్థిక సాయం
యూపీఎస్సీ మెయిన్స్ పరీక్ష ఆగస్టు 22 నుండి ఆగస్టు 31 వరకు జరిగింది. ఫలితాలు యూపీఎస్సీ తన వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. ఇంటర్వ్యూకి తెలంగాణ నుంచి 43 మంది ఎంపికయ్యారు. అయితే ఇంటర్వ్యూకి సెలక్ట్ అయిన వారంతా రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం పథకం కింద సాయం పొందినవారే. ఈ 43 మందికి త్వరలోనే రూ.లక్ష చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం అందించనుంది. సీఎం రేవంత్ రెడ్డి అందించనున్నారని తెలుస్తోంది.
వెబ్సైట్ ఫాలో కావాలి
వీరంతా తదుపరి దశ అయిన ఇంటర్వ్యూలో పాల్గొనవలసి ఉంటుంది. యూపీఎస్సీ తన వెబ్సైట్లో ఇంటర్వ్యూ తేదీలను విడుదల చేస్తుంది, ఇందులో పూర్తి ఇంటర్వ్యూ షెడ్యూల్ ఉంటుంది. దీని ఆధారంగా యూపీఎస్సీ ఇంటర్వ్యూకు హాజరు కావాలి. ఎంపికైన అభ్యర్థులు ఇప్పుడు యూపీఎస్సీ వెబ్సైట్ను ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండాలి.
ఇంటర్వ్యూ తర్వాత, తుది ఫలితం ప్రకటిస్తారు. ఇందులో యూపీఎస్సీ 2025 ప్రిలిమ్స్, మెయిన్స్, ఫైనల్ కటాఫ్లు ఉంటాయి. అభ్యర్థులు ఈ సమాచారాన్ని యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో తనిఖీ చేయవచ్చు.













