ఇంధన కొరతతో పెట్రోల్ బంకులు మూతపడతాయనే ప్రచారంతో వాహనదారులు బంకుల వద్దకు పోటెత్తారు. మంగళవారం హైదరాబాద్ లోని చాలా పెట్రోల్ బంకుల వద్ద బారులు కనిపించాయి. కొన్నిచోట్ల నో స్టాక్ బోర్డులు కూడా కనిపించాయి.
కొరత లేదు - పౌరసరఫరాల శాఖ

ఈ పరిస్థితులపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ క్లారిటీ ఇచ్చింది.రాష్ట్రంలో ఎక్కడా డీజిల్, పెట్రోల్, ఎల్పీజీ కొరత లేదని స్పష్టం చేసింది. అన్ని జిల్లాల్లో సరిపడా నిల్వలు ఉన్నాయని ఓ ప్రకటన ద్వారా పేర్కొంది.
పెట్రోల్, డీజిల్షార్టేజీ అంటూ వచ్చిన వదంతుల నేపథ్యంలో చాలా బంకుల వద్ద భారీ క్యూలైన్లు కనిపించాయని తెలిపింది. అనవసరమైన భయాందోళనల ఫలితంగా ఈ తరహా కృతిమ కొరతకు దారి తీసిందని పేర్కొంది.
ఇందన కొరత వదంతుల నేపథ్యంలో వాహనదారులు తమ వాహనాల ట్యాంకులను పూర్తిగా నింపుకోవడానికి పరుగులు తీయడం వల్లే ఈ కృత్రిమ కొరత ఏర్పడుతోందని పౌరసరఫరాల శాఖ తెలిపింది. డిపోలలో తగినంత ఇంధనం అందుబాటులో ఉన్నప్పటికీ… ఇది కృత్రిమ కొరతను సృష్టిస్తుందని అని ప్రకటన తెలిపింది.
చమురు మార్కెటింగ్ కంపెనీల (OMC) అడ్వాన్స్-చెల్లింపు నమూనాలకు సంబంధించి ఇటీవలే పరిపాలనా మార్పులు జరిగాయని వివరించింది. ఈ మార్పుల కారణంగా స్థానిక డీలర్లకు మాత్రమే చిన్నపాటి తాత్కాలిక సమస్యలు ఎదురయ్యాయని క్లారిటీ ఇచ్చింది. ఇది కేవలం అంతర్గత, పరిపాలనపరమైన విషయమని స్పష్టం చేసింది.
మరోవైపు రాష్ట్రంలోని ఇంధన అవుట్లెట్లను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇంధనాన్ని నిల్వ చేయడం, బ్లాక్ మార్కెటింగ్ కు పాల్పడటం లేదా దేశీయ ఎల్పిజి సిలిండర్లను వాణిజ్య ఉపయోగం కోసం చట్టవిరుద్ధంగా మళ్లించడంపై నిఘా పెడుతున్నారు. ఇలాంటి విషయాల్లో కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.
పౌరులందరూ ప్రశాంతంగా ఉండాలని, భయాందోళనలతో కొనుగోళ్లు చేయకుండా ఉండాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. "అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించండి. సోషల్ మీడియాలో ధృవీకరించని పుకార్లను నమ్మడం లేదా ఫార్వార్డ్ చేయకండి" అని ఓ ప్రకటనలో పేర్కొంది. ఏవైనా సందేహాలు లేదా ప్రశ్నాలున్నా…. అక్రమాలపై ఫిర్యాదు చేయాలన్నా పౌరసరఫరాల శాఖ టోల్ ఫ్రీ హెల్ప్లైన్ నంబర్ 1967ను సంప్రదించాలని సూచించింది.