భక్తులకు దర్శనమిస్తున్న ఖైరతాబాద్ బడా గణేష్.. గవర్నర్ దంపతుల తొలిపూజ

ఖైరతాబాద్ బడా గణేష్ కొలువుదీరాడు. తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా దంపతులు సంకటహర మహాగణపతికి తొలి పూజ చేశారు.

Published on: Sep 14, 2026, 15:34:18 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హైదరాబాద్ నగరం వినాయక చవితి పండుగ శోభతో విలసిల్లుతోంది. దేశవ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందిన ఖైరతాబాద్ బడా గణేష్ ఈసారి 70 అడుగుల భారీ ఎత్తులో ‘శ్రీ పంచముఖ సంకటహర మహాగణపతి’ రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నాడు. గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రసిద్ధ ఖైరతాబాద్ గణపతికి తొలి పూజ అత్యంత వైభవంగా నిర్వహించారు.

ఖైరతాబాద్ గణేష్
ఖైరతాబాద్ గణేష్

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, ఆయన సతీమణి జానకి శుక్లా దంపతులు ఖైరతాబాద్ గణనాథుడిని దర్శించుకుని తొలి పూజ చేశారు. మెుదట ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, మంత్రి పొన్నం ప్రభాకర్, స్థానిక శాసనసభ్యులు దానం నాగేందర్ గవర్నర్ దంపతులకు ఘనంగా స్వాగతం పలికారు. వేద పండితులు, అర్చకుల మంత్రోచ్ఛారణల నడుమ గవర్నర్ దంపతులు విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు అందించారు. అనంతరం రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని స్వామివారిని ప్రార్థించారు.

ఈ వేడుకల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రి పొన్నం ప్రభాకర్ ఖైరతాబాద్ స్వామివారికి సాంప్రదాయబద్ధంగా పట్టువస్త్రాలు సమర్పించారు. అదేవిధంగా పద్మశాలి సంఘం ప్రతినిధులు గణనాథుడి కోసం ప్రత్యేకంగా తయారు చేసిన భారీ కండువా, సుదీర్ఘమైన యజ్ఞోపవీతాన్ని శోభాయాత్రగా తీసుకొచ్చి అర్చకులకు అందజేశారు.

స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో మహారాష్ట్రలో లోకమాన్య తిలక్ ప్రారంభించిన గణేష్ ఉత్సవాల స్ఫూర్తితో ఖైరతాబాద్‌లో విగ్రహ ప్రతిష్ఠాపన ప్రారంభమైంది. ఏటికేడు మారుతున్న రూపాలతో, శిల్పకళా వైభవంతో 70 ఏళ్లకు పైగా ఇక్కడ ఉత్సవాలు సాగుతున్నాయి. మట్టి ప్రతిమలతో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ, భక్తిశ్రద్ధలతో ఈ వేడుకలను నిర్వహించడం ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ ప్రత్యేకత.

మహాగణపతి దర్శనార్థం తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా వేలాదిగా భక్తులు ఖైరతాబాద్‌కు తరలివస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక రూట్ డైవర్షన్లు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీసీటీవీ కెమెరాల నిఘాతో పాటు భారీగా పోలీసు బలగాలతో భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశారు. దర్శనానికి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్లు, మంచినీటి సదుపాయాలు కల్పించారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More