మంత్రిపదవి ఊడినా వెనక్కి తగ్గేదే లేదన్న కొండా దంపతులు.. కార్యకర్తల సమావేశంలో కీలక వ్యాఖ్యలు

మంత్రి పదవి నుంచి తొలగించినందుకు బాధగా లేదని ఎమ్మెల్యే కొండా సురేఖ అన్నారు. అకారణంగా తొలగించడం బాధ కలిగిస్తోందన్నారు. మరోవైపు కొండా మురళి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు.

Published on: Sep 13, 2026, 16:36:16 IST
By , Warangal
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మంత్రివర్గం నుంచి తొలగించడంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కొండా సురేఖ స్పందించారు. పదవి పోయినందుకు తనకు ఎలాంటి బాధ లేదని, కానీ ఎటువంటి కారణం లేకుండా తొలగించడం మాత్రం మనస్తాపానికి గురిచేసిందని పేర్కొన్నారు. బర్తరఫ్ వేటు పడిన అనంతరం వరంగల్‌లో తొలిసారిగా తన మద్దతుదారులు, పార్టీ కార్యకర్తలతో కొండా దంపతులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు.

కొండా మురళి, కొండా సురేఖ
కొండా మురళి, కొండా సురేఖ

ఈ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ.. ప్రస్తుత రాజకీయాల్లో అవకాశవాదం ఎక్కువైపోయిందని విమర్శించారు. పదవుల కంటే ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఎంపీపీ స్థాయి నుంచి మంత్రి పదవి వరకు ఎదిగానని, గతంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కోసం ఎలాంటి ఆలోచన లేకుండా పదవికి రాజీనామా చేశానని గుర్తుచేశారు.

ఉదయం ఒక పార్టీలో ఉండి మధ్యాహ్నానికి మరో పార్టీ కండువా కప్పుకునే సంస్కృతి తమది కాదని, కొందరు వార్డు మెంబర్ పదవికి కూడా రాజీనామా చేయలేని పరిస్థితుల్లో ఉన్నారని ఎద్దేవా చేశారు. గతంలో కాంగ్రెస్‌లో కొందరు కుట్రలు చేసి తమకు టికెట్ రాకుండా అడ్డుకున్నప్పుడు కేసీఆర్ పిలిచి వరంగల్ ఈస్ట్ టికెట్ ఇచ్చారని, అక్కడ పోటీ చేసి నాటి అధికార పార్టీ మంత్రిని ఓడించామని సురేఖ చెప్పారు.

'పదవులు వస్తుంటాయి, పోతుంటాయి. పదవి లేకపోయినా ప్రజల మధ్యే ఉంటూ సేవ చేస్తాం. రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో విజయం సాధిస్తాం. ఇక బర్తరఫ్ వార్త తెలిసిన తర్వాత కొందరు కార్యకర్తలు ఆందోళనలు చేద్దామని ఫోన్ చేశారు. కానీ అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉండాలని అందరికీ నచ్చజెప్పాం. అలాగే రేవంత్ రెడ్డి రైతు పాదయాత్ర సమయంలో కాంగ్రెస్ పార్టీకి ఆయనలాంటి మాస్ లీడర్ అవసరమని చెప్పిన మొదటి వ్యక్తిని నేనే.' అని సురేఖ అన్నారు.

సారీ చెప్పే ప్రసక్తే లేదు: కొండా మురళి

ఈ సమావేశంలో కొండా మురళి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే తమ ఆశయమని తెలిపారు. 'మంత్రి పదవి దక్కించుకోవడం కంటే ఆత్మగౌరవంతో బతకడమే ముఖ్యం. సురేఖను క్షమాపణలు చెప్పాలని కొందరు కోరారు. కానీ పదవి ఊడినా పర్లేదు గానీ సారీ చెప్పేది లేదని నా భార్య తేల్చి చెప్పింది. మా రక్తంలోనే కృతజ్ఞత ఉంది, మాట కోసం నిలబడే తత్వం మాది.' అని కొండా మురళి స్పందించారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More