రాబోయే 7 రోజులు తెలంగాణ వెదర్ అప్డేట్.. భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక
రాబోయే ఐదు రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు పడనున్నట్టుగా వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
తెలంగాణ రాష్ట్రంలో రాగల ఐదు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్రంలోని పలు జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్ష సూచనతో పాటు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాల హెచ్చరికలను జారీ చేసింది.

సెప్టెంబర్ 20 – 21: రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది.
సెప్టెంబర్ 21 – 22: రాష్ట్రంలో అనేక చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉండగా, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
సెప్టెంబర్ 22 – 23: కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు, గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.
సెప్టెంబర్ 23 – 25 : సెప్టెంబర్ 23 నుంచి 25 మధ్య కాలంలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో బలమైన ఈదురుగాలులు (గంటకు 50-60 కి.మీ వేగం), భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వాతావరణ శాఖ ప్రత్యేక హెచ్చరికలు జారీ చేసింది.
సెప్టెంబర్ 25 – 27: పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కొనసాగే అవకాశం ఉంది.
భారీ వర్షాలు మరియు గాలివానల కారణంగా పలు సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాలు మరియు రోడ్లపై నీరు నిలవడం, ప్రయాణాలు, ట్రాఫిక్కు ఆటంకం ఏర్పడడం, చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోవడంవంటి సమస్యలు వస్తాయని తెలిపింది. విద్యుత్ సరఫరా, నీటి సరఫరా, ఇతర సేవలకు అంతరాయం కలగడం, డ్రైనేజీ/మురుగు నీరు పారడానికి అవరోధాలు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది.
ప్రతికూల వాతావరణ పరిస్థితుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. అనవసర ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి. వర్షం/ఉరుములు వస్తున్న సమయంలో చెట్ల కింద నిలబడకూడదు. షెడ్లు, నిర్మాణాలకు దూరంగా ఉండాలి. వ్యవసాయదారులు వాతావరణ హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ తగిన చర్యలు తీసుకోవాలి. ఉరుములు, మెరుపుల సమయంలో పొలాల్లో ఒంటరిగా ఉండకూడదని వాతావరణ శాఖ తెలిపింది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


