వివాహేతర సంబంధాలు పచ్చని సంసారాల్లో చిచ్చు రేపుతున్నాయి. కొన్నిచోట్ల విడిపోవటాలు జరుగుతుండగా… మరికొన్ని వ్యవహారాల్లో ప్రాాణాలే పోతున్నాయి. కట్టుకున్న వారని కూడా చూడకుండా కడతేర్చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో కూడా ఓ ఘటన వెలుగు చూసింది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడనే కారణంతో నిద్రపోతున్న భర్తను చున్నీతో ఉరేసి హత్య చేశారు. పోలీసులు విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి.
కూకట్పల్లిలో దారుణం (representative image )
భార్య భర్తలు అయిన సుధీర్ రెడ్డి, ప్రసన్న… కూకట్పల్లిలో నివాసముంటున్నారు. వీరిద్దరి మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవలకు మరో వ్యక్తితో ఉన్న వివాహేతర సంబంధం అని తెలిసింది. ఈ విషయాన్ని భర్త గట్టిగా ప్రశ్నించటాన్ని భార్య ప్రసన్న తట్టుకోలేకపోయింది. ఎలాగైనా భర్తను వదిలించుకోవాలని చూసింది. అయితే భార్య తీరుపై కన్నేసి సుధీర్ రెడ్డి… ఓసారి పోలీసులను కూడా ఆశ్రయించాడు. తనను చంపేందుకు భార్య ప్రసన్న ప్రయత్నించిందని పేర్కొన్నాడు.
ఆ తరువాత ఇద్దరి మధ్య గొడవ సద్దుమణిగింది. కట్ చేస్తే… ఆ తర్వాతి వారం రోజుల్లోనే సుధీర్ రెడ్డి హత్యకు గురయ్యాడు. గత నెల 24వ తేదీన సుధీర్ రెడ్డి మెడకు చున్నీ బిగించి భార్య ప్రసన్న చంపేసింది. అంతేకాదు… తనకేం తెలియదన్నట్లు డ్రామా షురూ చేసింది. కానీ సుధీర్ రెడ్డి సోదరి పోలీసులకు ఫిర్యాదు చేయగా…. సంచలన విషయా లు బయటపడ్డాయి.
సుధీర్ రెడ్డి మృతిపై అనుమానాలను పరిగణనలోకి తీసుకున్న పోలీసులు… పోస్టుమార్టం నివేదిక ఆధారంగా విచారణ ముమ్మరం చేశారు.ఈ క్రమంలోనే భార్య ప్రసన్నను తమదైన శైలిలో విచారించారు.తానే హత్య చేసినట్లు ప్రసన్న అంగీకరించింది. చున్నీతో అతడి మెడకు ఉరి బిగించి హత్య చేసినట్లు పేర్కొంది. దీంతో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు… ఆమెను కోర్టులో హాజరుపర్చి సంగారెడ్డి జిల్లాలోని కంది జైలుకు తరలించారు.