ఈనెల 18 నుంచి యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలు - భక్త దంపతులు ఈ ఛాన్స్ మిస్ కాకండి..!

 ఈనెల 18 నుంచి యాదగిరిగుట్టలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 28వ తేదీన రాత్రి నిర్వహించే డోలోత్సవంతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. 

Published on: Feb 17, 2026, 08:28:09 IST
By , Yadagirigutta
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. ఈనెల 18వ తేదీన స్వస్తివాచనంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమై… ఫిబ్రవరి 28వ తేదీన రాత్రి నిర్వహించే డోలోత్సవంతో ముగుస్తాయి. ఇందుకోసం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు.

యాదగిరిగుట్ట (ఫైల్ ఫొటో)
యాదగిరిగుట్ట (ఫైల్ ఫొటో)

యాదాద్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 24వ తేదీన రాత్రి ఎదుర్కోలు ఉంటుంది. ఈనెల 25న రాత్రి తిరుకళ్యాణ మహోత్సవం, 26వ తేదీన దివ్య విమాన రథోత్సవం నిర్వహిస్తారు. ఫిబ్రవరి 20వ తేదీ నుంచి 26 వరకు స్వామి వారికి వివిధ అలంకార సేవలు జరుగుతాయి.

ఆరు రోజులపాటు అలంకార సేవలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.2 కోట్లు కేటాయించినట్టు అధికారులు తెలిపారు. ఈ ఉత్సవాల్లో 100 మంది పారాయణీకులు, రుత్వికులు, ఆచార్యులు, పండితులు పాల్గొననున్నారు.

ఏర్పాట్లు పూర్తి…

బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణమంతా విద్యుద్దీపకాంతులతో మిరిమిట్లు గొలిపేలా ఏర్పాట్లు చేశారు. బ్రహ్మోత్సవాలను దృష్టిలో ఉంచుకుని యాదాద్రిలో ఈ నెల 18 నుంచి 28 వరకు నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, సుదర్శన నారసింహ హోమం, మొక్కు సేవలను రద్దు చేస్తున్నట్టు ఆలయ ఈవో ప్రకటించారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, దేవస్థానం ఆధ్వర్యంలో సంగీత, సాహిత్య కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు.

యాదగిరిగుట్టకు వచ్చే ప్రధాన రహదారులతో పాటు పట్టణంలో స్వాగత తోరణాలు, ఆర్చిల ఏర్పాటు పనులు పూర్తి చేశారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ సహా రాష్ట్రంలోని అన్ని ప్రధానాలయాల నుంచి యాదగిరిగుట్టకు ప్రత్యేక బస్సులను నడిపేందుకు తెలంగాణ ఆర్టీసీ చర్యలు చేపట్టింది.

దంపతులు పాల్గొనే అవకాశం…

ఇక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా వారం రోజులు నిర్వహించే అలంకార సేవలు, వాహనోత్సవాల్లో భక్త దంపతులు పాల్గొనే అవకాశం కల్పించనున్నారు. రూ.20 వేలు చెల్లించిన దంపతులకు ఈ నెల 20 నుంచి 26 వరకు జరిగే బ్రహ్మోత్సవ సంబరాల్లో పాల్గొనొచ్చు. అంతరాలయ ప్రవేశం, స్వయంభువుల దర్శనం ఉంటుంది.

అఖండజ్యోతి యాత్ర ప్రారంభం…

యాదగిరిగుట్ట ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ బర్కత్‌‌‌‌‌‌‌‌పురలోని యాదగిరి భవన్‌‌‌‌‌‌‌‌ నుంచి ఆదివారం నారసింహుడి ‘అఖండజ్యోతి యాత్ర’ ప్రారంభమైంది. కేంద్రమంత్రి కిషన్‌‌‌‌‌‌‌‌రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌రెడ్డితో కలిసి జ్యోతిని వెలిగించి యాత్రను ప్రారంభించారు. వైఎంసీఏ నారాయణగూడ నుంచి రామంతాపూర్, హబ్సిగూడ, ఉప్పల్ మీదుగా ఈ నెల 18న రాత్రి 8 గంటల వరకు యాదగిరిగుట్ట చేరుకుంటుంది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More