కౌలు రైతులకు రుణాలు.. లోన్ పొందడానికి అర్హతలు, పూర్తి వివరాలు ఇవి!
ఆంధ్రప్రదేశ్లో కౌలు రైతులకు రూ.లక్ష వరకు రుణం మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన కార్యాచరణ మెుదలుపెట్టింది.
కౌలు రైతులు కూడా తమకు ప్రభుత్వం తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. అయితే ప్రభుత్వం తాజాగా వారికి గుడ్న్యూస్ చెప్పింది. ఏపీలో కౌలు రైతులకు రూ.లక్ష వరకు రుణం పొందవచ్చు. ఇందుకు సంబంధించిన ప్రక్రియను మెుదలు పెట్టింది ప్రభుత్వం. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు(పీఏసీఎస్లు) ద్వారా రుణాలు ఇవ్వనున్నారు.

ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల దగ్గర రుణాలు తీసుకుని.. అధిక వడ్డీని చెల్లిస్తూ ఇబ్బందులు పడుతున్నారు కౌలు రైతులు. పంట సాగు పెట్టుబడి కోసం రూ.లక్ష వరకు తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కౌలు రైతులను మరింత ప్రోత్సహించే ప్రణాళికలో భాగంగా అందజేయనుంది.
మీ ప్రాంతాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల నుంచి రుణాలను అందించనుంది ప్రభుత్వం. ప్రస్తుతం అధికారులు ఏపీ వ్యాప్తంగా కౌలు రైతుల వివరాలను సేకరిస్తున్నారు. ఇందులో అర్హులైన వారికి వెంటనే రుణాలు మంజూరు చేసే అవకాశం ఉంది.
ప్రభుత్వం అందించే రుణాలు విత్తనాలకు, ఎరువులు, కూలీ ఖర్చులు వంటి ముఖ్యమైన వ్యవసాయ అవసరాలకు ఉపయోగపడతాయి. ఈ రుణాలు పొందడానికి కౌలు రైతులు సంబంధిత అధికారులు జారీ చేసిన కౌలు రైతు పత్రాలు, సహకార సంఘం పరిధిలో నివాసం ఉంటూ అందులో సభ్యత్వం ఉండాలి.
రుణం కోసం దరఖాస్తు చేసే రైతు కౌలు పత్రంలో చూపించిన సాగు భూమి ఎకరాకు తగ్గకుండా ఉండాలనే నిబంధన ఉంది. అసైన్డ్ భూములను సాగు చేస్తున్న కౌలు పత్రాలు ఉన్నవారికి రుణాలు రావు. సొంత ఇల్లు ఉన్నవారికి రుణాల మంజూరు చేయడంలో ప్రాధాన్యత ఉంటుంది. లోన్ వచ్చిన తేదీ నుంచి ఒక సంవత్సరంలోపు అసలు, వడ్డీని తిరిగి చెల్లించాలి.
వడ్డీ వ్యాపారుల బారి నుంచి కౌలు రైతులను రక్షించేందుకు అర్హులైనవారికి తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా కౌలు రైతులను అప్పుల సమస్య నుంచి బయటపడేయవచ్చు అని అనుకుంటోంది. ప్రస్తుతం అధికారులు రాష్ట్రవ్యాప్తంగా కౌలు రైతుల వివరాలను సేకరించే పనిలో ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని వేగవంతం చేశారు. వివరాల సేకరణ అయిన వెంటనే.. లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేసే ప్రక్రియ మెుదలుపెడతారు.














