తిరుమలలో శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు గురువారం అర్ధరాత్రితో ముగిశాయి. డిసెంబరు 30న ప్రారంభమైన ఈ దర్శనాలకు రికార్డు స్థాయిలో భక్తులు తరలివచ్చారు. ఏకాంత సేవ అనంతరం వైకుంఠ ద్వార దర్శనం తలుపులు మూసివేశారు. మొత్తం 10 రోజుల్లో 7.83 లక్షల మంది భక్తులకు వైకుంఠద్వార దర్శనం దక్కింది.
రికార్డు స్థాయిలో దర్శనాలు…

టీటీడీ చరిత్రలోనే కాక, ఎన్నడూ లేని విధంగా ఈసారి వైకుంఠ ద్వార దర్శనాలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం… రికార్డు స్థాయిలో 7.83 లక్షల మంది భక్తులకు వైకుంఠద్వార దర్శనం కలిగింది. టీటీడీ ఏర్పాట్లు, సదుపాయాలపై 93 శాతం భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు.
2024 ఏడాదిలో 6.83 లక్షలు, 2023లో 6.47 లక్షలతో పోలిస్తే భక్తుల సంఖ్య ఎక్కువగా పెరిగింది. 10 రోజుల్లో రూ.41 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది. 44 లక్షల లడ్డూలు విక్రయం కాగా… గతేడాదితో పోలిస్తే 10 లక్షలు అధికంగా విక్రయించినట్లు ప్రకటించారు.
గతేడాదికంటే 27 శాతం అధికంగా అన్నప్రసాదాల పంపిణీ జరిగింది. 50 టన్నుల సంప్రదాయ పుష్పాలు, 10 టన్నుల పండ్లు, 4 టన్నుల కట్ ఫ్లవర్స్తో అద్భుతమైన అలంకరణలు చేశారు. కళ్యాణకట్ట, పారిశుద్ధ్యం, వైద్య సేవల ఏర్పాట్లు భక్తులకు ఎంతో ఉపయోగకరంగా నిలిచాయి AI కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతర పర్యవేక్షణ కొనసాగింది.
ప్రణాళికాబద్ధ క్యూలైన్ నిర్వహణతో అంచనాలకన్నా ఎక్కువ మందికి దర్శనం కల్పించగలిగామని టీటీడీ ఛైర్మన్ బీఆర్ఎస్ నాయుడు పేర్కొన్నారు. ఈ వైకుంఠద్వార దర్శనాలను శాంతియుతంగా విజయవంతం చేసిన భక్తులకూ, మెరుగైన సేవలు అందించిన అధికారులు, సిబ్బంది మరియు సేవకులకూ కృతజ్ఞతలు తెలిపారు.