శ్రీకాకుళం జిల్లా ప్రజలకు శుభవార్త. ఎంతోకాలంగా చేసిన ప్రయత్నాల ఫలితంగా శ్రీకాకుళం జిల్లాలో ప్రయాణించే మూడు ముఖ్యమైన రైళ్లకు ఇప్పుడు కీలక స్టేషన్లలో రైల్వే శాఖ హల్ట్లు మంజూరు చేసింది.

ఈ హల్ట్ల ద్వారా జిల్లాలోని అంతర్గత ప్రాంతాలకు రవాణా సౌకర్యం, విశాఖపట్నం వంటి ప్రధాన పట్టణాలకు విద్య, వైద్యం, ఉపాధి, వ్యాపార అవసరాల కోసం ప్రయాణం మరింత సులభమవుతుందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. తమ అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్కు శ్రీకాకుళం జిల్లా ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. రైళ్లు ఆగే స్టేషన్లు ఇవే..
- 58505/06 గుణుపూర్–విశాఖపట్నం ప్యాసింజర్ రైలు ఇకపై హరిశ్చంద్రపురం వద్ద ఆగుతుంది.
- 18525/26 బెరహంపూర్–విశాఖపట్నం ప్యాసింజర్ రైలు మందస రోడ్ వద్ద హాల్ట్ ఉంది.
- 18117/18 రాజ్య రాణి ఎక్స్ప్రెస్ రైలు పాతపట్నం వద్ద స్టాప్ ఉంది.
ఈ కొత్త స్టాపేజీల ద్వారా శ్రీకాకుళం జిల్లాలో మెరుగైన రైల్వే కనెక్టివిటీ, ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి కొత్త అవకాశాలను తీసుకువస్తుందని పేర్కొన్నారు రామ్మోహన్ నాయుడు. శ్రీకాకుళం జిల్లాలో ప్రతి ప్రాంతానికీ అభివృద్ధి చేరేలా మౌలిక వసతులను బలోపేతం చేసే దిశగా ఇది మరో ముఖ్యమైన అడుగు అని వ్యాఖ్యానించారు.
శ్రీకాకుళం జిల్లాలో రోడ్లపై విజ్ఞప్తి
మరోవైపు శ్రీకాకుళం జిల్లాలో జాతీయ రహదారుల అభివృద్ధి గురించి దిల్లీలో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో రామ్మోహన్ నాయుడు భేటీ అయ్యారు. శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలోని నరసన్నపేట నుండి ఇచ్ఛాపురం వరకు చెన్నై-కలకత్తా జాతీయ రహదారి 16ను ఆరువరుసలు చెయ్యాల్సిన అవశ్యకతను వివరించారు. అదేవిధంగా శ్రీకాకుళం నగరంలోని నవభారత్ కూడలితో పాటు పలు ముఖ్య కూడళ్లలో ఫ్లై ఓవర్ల అవసరాన్ని స్పష్టంగా తెలియపరిచారు.
'రాష్ట్ర రహదారులుగా ఉన్న కళింగపట్నం - శ్రీకాకుళం - పార్వతీపురం (145km), గార - అలికాం - బత్తిలి (118km) లైన్లను జాతీయ రహదారులుగా మార్చాలని కోరాము. శ్రీకాకుళం జిల్లా అవసరాలను అర్థం చేసుకున్న నితిన్ గడ్కరీ.. సంబంధిత ప్రాజెక్టులపై నివేదిక సిద్ధం చేయమని తన శాఖకు ఆదేశించారు. జాతీయ రహదారుల అభివృద్ధి, విస్తరణ, ఫ్లై ఓవర్ల ఏర్పాటు ద్వారా జిల్లా మరింత వేగంగా అభివృద్ధి పథంలో పయనిస్తుందని విశ్వసిస్తున్నాను.' అని రామ్మోహన్ నాయుడు చెప్పారు.