వైకుంఠ ద్వార దర్శనాలకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశాం : టీటీడీ ఛైర్మన్

వైకుంఠ ద్వార దర్శనాలకు విస్తృత ఏర్పాట్లు చేశామని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకున్నామని తెలిపారు.

Published on: Dec 15, 2025 2:48 PM IST
By , Tirumala
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

వైకుంఠ ద్వార దర్శనాలకు భక్తులకు ఇబ్బందులకు కలగకుండా ఏర్పాట్లు చేసినట్టుగా టీడీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు ఉంటాయన్నారు. మెుదటి మూడు రోజులకు ఎలక్ట్రానిక్ లక్కీడిప్ ద్వారా టోకెన్లు కేటాయించామని తెలిపారు. మిగతా ఏడు రోజులు సామాన్య భక్తులకు టోకెన్లు లేకపోయినా సర్వదర్శనం ద్వారా వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామన్నారు.

టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు
టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు

తిరుమలలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టిసారించామన్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేశామని బీఆర్ నాయుడు పేర్కొన్నారు. భక్తుల రద్దీ ఉన్న ప్రదేశాల్లో ఏర్పాట్లు, సదుపాయాలపై నిరంతరం పర్యవేక్ష ఉంటుందన్నారు. పీఏసీలను అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దుతామని చెప్పారు.

'ఆలయ ధ్వజస్తంభాల కోసం వంద ఎకరాల్లో టీటీడీ స్వయంగా దివ్య వృక్షాలను పెంచాలని అనుకుంటోంది. పలమనేరులో టీడీడీ గోశాల ఆవరణ వృక్షాలను పెంచడానికి అనువైన స్థలం గుర్తించాం. మంగళవారం జరిగే టీటీడీ పాలకమండలి సమావేశంలో 50 అజెండా అంశాల మీద చర్చిస్తాం.' అని బీఆర్ నాయుడు వెల్లడించారు.

స్థానికులకు ఈ-డిప్ ద్వారా వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు

తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేది వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాల్లో జనవరి 6, 7, 8వ తేదిల్లో రోజుకు 5వేల టోకెన్ల చొప్పున తిరుమల, తిరుపతి, రేణిగుంట, చంద్రగిరి ప్రాంతాల వారికి స్థానికుల కోటా కింద కేటాయించాలని టీటీడీ నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. డిసెంబర్ 25వ తేది ఉదయం 10 నుండి 27 వ తేది సాయంత్రం 5 గంటల వరకు ఈ-డిప్ నమోదుకు టీటీడీ అవకాశం కల్పించనుంది.

తిరుమల, తిరుపతి, రేణిగుంట, చంద్రగిరికి చెందిన స్థానికులు పైన పేర్కొన్న తేదీల్లో 1+3 విధానంలో ఈ-డిప్ కోసం టీటీడీ వెబ్ సైట్, మొబైల్ యాప్, వాట్సాప్ ద్వారా నమోదు చేసుకోవచ్చు. డిసెంబర్ 29న మధ్యాహ్నం 2 గంటలకు ఈ-డిప్ ద్వారా టోకెన్లు కేటాయించడం జరుగుతుంది. ఇందులో రోజుకు తిరుపతి, రేణిగుంట, చంద్రగిరి స్థానికులకు 4500, తిరుమల స్థానికులకు 500 టోకెన్లు చొప్పున కేటాయించనున్నారు. ఈ విషయాన్ని గమనించి స్థానికులు టోకెన్ల కోసం ఈ-డిప్ ద్వారా నమోదు చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.