క్వాలిటీ చెక్కు టీటీడీ కొత్త విధానం.. థర్డ్ పార్టీ సర్టిఫికేషన్ తప్పనిసరి చేస్తుందా?
తిరుమలకు అవసరమయ్యే వాటిని సేకరించే విషయంలో ఇకపై కొత్త విధానం తీసుకురావాలని టీటీడీ భావిస్తోందని తెలుస్తోంది. క్వాలిటీ చెక్ కోసం థర్డ్ పార్టీ సర్టిఫికేషన్ కోసం కూడా ఆలోచన చేసేందుకు చూస్తోంది.
తిరుమలలో పట్టు శాలువాలకు బదులుగా పాలిస్టర్ను ఉపయోగించినట్టుగా ఇటీవల బయటపడిన విషయం తెలిసిందే. అయితే బయట నుంచి సేకరణలో అక్రమాలను గుర్తించేందుకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకోనున్నుట్టుగా తెలుస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త సేకరణ మాన్యువల్ను ప్రవేశపెట్టనుంది. అంతేకాదు బయటి ఏజెన్సీల నుండి కొనుగోలు చేసిన అన్ని సామగ్రికి థర్డ్ పార్టీ ధృవీకరణను తప్పనిసరి చేస్తుంది. ఇటీవల చైర్మన్ బీఆర్ నాయుడు నేతృత్వంలో జరిగిన టీటీడీ ట్రస్ట్ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.

కల్తీ నెయ్యి, నకిలీ పట్టు దుపట్టాలకు సంబంధించిన కేసుల నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న సేకరణ, నాణ్యత తనిఖీ వ్యవస్థలను బలోపేతం చేయాలని టీటీడీ భావిస్తోంది. నెయ్యి కల్తీ కేసుపై ప్రస్తుత దర్యాప్తులో సరఫరా గొలుసులో తీవ్రమైన లోపాలు వెల్లడయ్యాయని, నాణ్యత, జవాబుదారీతనం నిర్ధారించడానికి స్పష్టమైన, ఏకరీతి సేకరణ వ్యవస్థ అవసరాన్ని టీటీడీ ఆలోచన చేస్తోంది
సేకరణలో లొసుగులను నిలిపివేయడానికి సమగ్ర సేకరణ మాన్యువల్ అవసరమని ట్రస్ట్ బోర్డు భావించిందని ఓ అధికారి తెలిపారు. థర్డ్ పార్టీ సర్టిఫికేషన్ విషయంలో భారత ఆహార భద్రత, ప్రమాణాల అథారిటీ నిబంధనలకు అనుగుణంగా స్పష్టంగా నిర్వచించిన విధానాలు, సరఫరా గొలుసులను బలోపేతం చేయాలని టీటీడీ భావించింది. కల్తీని, నాణ్యత లేని సామాగ్రిని అడ్డుకోవడం, ఆలయ సంబంధిత సేవలకు ఉపయోగించే పదార్థాలపై విశ్వాసాన్ని పునరుద్ధరించడం దీని లక్ష్యమని అధికారి తెలిపారు.
కొత్త మాన్యువల్ ట్రస్ట్.. టీటీడీ చేసే అన్ని కొనుగోళ్లకు మార్గదర్శకంగా పనిచేస్తుంది. ఇది ఉత్పత్తి వివరణలు, నమూనా సేకరణ, నిర్వహణ, నాణ్యత తనిఖీలు, సరఫరా ఒప్పందాలు, డెలివరీ షెడ్యూల్లు, సరఫరాదారులకు సాంకేతిక, ఆర్థిక అర్హత ప్రమాణాలకు సంబంధించిన విధానాలను చెబుతుంది.
టీటీడీ తీసుకురాబోయే కొత్త వ్యవస్థకు అంతర్గత ప్రయోగశాల పరీక్ష కోసం స్పష్టమైన ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలతో పాటు, తప్పనిసరి థర్డ్ పార్టీ ధృవీకరణ అవసరం. అన్ని సేకరణలు FSSAI, ఇతర వర్తించే నియమాలను కచ్చితంగా పాటించాలి.
ఆలయ పూజలు, అన్నదానం, వసతి, ఇతర కార్యకలాపాల కోసం దాదాపు 300 రకాల సామాగ్రిని సేకరించడానికి టీటీడీ ప్రతి సంవత్సరం సుమారు రూ.700 కోట్లు ఖర్చు చేస్తుంది. నెయ్యి ఒక్కటే వార్షిక వ్యయం దాదాపు రూ.70 కోట్లు. గిడ్డంగి సామర్థ్యం సరిపోకపోవడం, ఆధునిక నిల్వ పద్ధతులు లేకపోవడంపై టీటీడీ బోర్డు ఆలోచన చేస్తోంది. ఎందుకంటే ఇది జాబితా నిర్వహణ, మెటీరియల్ నాణ్యత రెండింటికీ ప్రమాదాలను కలిగిస్తుంది.
సంస్కరణల్లో భాగంగా క్లైమెట్ కంట్రోల్ స్టోరెజ్, శాస్త్రీయ జాబితా నిర్వహణ వ్యవస్థలు, ఉష్ణోగ్రత, తేమ, పరిశుభ్రత ఆటోమేటెడ్ పర్యవేక్షణ, డిజిటల్ ట్రాకింగ్ విధానాలు, అగ్ని మరియు ఆహార-భద్రత-అనుకూల మౌలిక సదుపాయాలతో కూడిన అదనపు గిడ్డంగి సౌకర్యాలను తీసుకురావాలని టీటీడీ భావిస్తోంది.














