...
...
Next Story

Online Services : ఆంధ్రప్రదేశ్‌లో డిసెంబర్‌నాటికి అన్ని ప్రభుత్వ సేవలూ ఆన్‌లైన్‌లోనే

AP Online Services : డిసెంబర్ నాటికి అన్ని ప్రభుత్వ సేవలూ ఆన్‌లైన్‌లోనే ఉంటాయని సీఎం చంద్రబాబు చెప్పారు. శాటిలైట్ సమాచారం వినియోగించుకునేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్టుగా చెప్పారు.

Published on: Apr 30, 2026, 08:14:17 IST
Advertisement

ప్రభుత్వ శాఖలు అందిస్తున్న అన్ని సేవలు ఈ ఏడాది డిసెంబర్ నాటికల్లా ఆన్‌లైన్‌లో అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. వాట్సప్ గవర్నెన్స్ మన మిత్ర పరిధిలోకి అన్ని సేవలు తీసుకు వస్తే ప్రజలకు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పని ఉండదని చెప్పారు. ఆర్టీజీఎస్‌పై వివిధ శాఖల ఉన్నతాధికారులతో క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.

అన్ని ప్రభుత్వ సేవలూ ఆన్‌లైన్‌లోనే
అన్ని ప్రభుత్వ సేవలూ ఆన్‌లైన్‌లోనే

మనమిత్ర వాట్సప్ గవర్నెన్స్ ద్వారా ప్రస్తుతం 1,035 సేవలు అందిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. వాట్సప్ గవర్నెన్సు సేవలు ప్రారంభించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో 54 లక్షల మంది 1.78 కోట్ల సేవలు పొందారని ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. వాట్సప్ గవర్నెన్స్ సేవల వినియోగం పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకూ 24 లక్షల మందికి పైగా వాట్సప్ గవర్నెన్సు సేవలు ఎలా పొందాలో అవగాహన కల్పించామని చెప్పారు.

కర్నూలు జిల్లాలో ఏర్నాటు చేస్తున్న డ్రోన్ సిటీ ఫేజ్ 1 అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయని... ఇప్పటికే ప్లాంట్లు నెలకొల్పేందుకు ముందుకొచ్చిన 8 కంపెనీలకు భూముల కేటాయింపు పూర్తయ్యిందని చంద్రబాబుకు అధికారులు చెప్పారు. మే నెల రెండో వారంలో ఇవన్నీ గ్రౌండ్ అవుతాయని వివరించారు. డ్రోన్ సిటీ మాస్టర్ ప్లాన్ ఖరారయ్యిందని అధికారులు ఇచ్చిన వివరణపై స్పందించిన సీఎం.. ఈ ఏడాది జూలై నాటికి మొదటి దశ పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

దేశంలో మరే రాష్ట్రంలోనూ లేనంతగా ఆంధ్రప్రదేశ్‌లో సీసీ టీవీ కెమేరాల ఏర్పాటు, వాటి వినియోగం, పర్యవేక్షణ జరుగుతోందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. దీనివల్ల రాష్ట్రంలో నేరాల నియంత్రణ, నేరస్తులను గుర్తించడంతో పాటు.. మిస్సింగ్ కేసుల ట్రేసింగ్, వాహనాల దొంగతనాల వంటి కేసులు వేగంగా కొలిక్కి వస్తున్నాయని చెప్పారు. అయితే సీసీ కెమేరాలు లేని ప్రాంతాల్లో ప్రైవేట్ వ్యక్తులు ఏర్పాటు చేసిన సీసీ కెమేరాల డేటాను కూడా ఇంటిగ్రేట్ చేయాలని, ప్రజల్లో దీనిపై అవగాహన కల్పించాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. సీసీ కెమేరాలతో పాటు శాటిలైట్ డేటాను వినియోగించు కునేలా కార్యాచరణ చేపట్టాలని సూచించారు. శాటిలైట్ సమాచారాన్ని ఆర్టీజీఎస్‌కు అనుసంధానించి వేగంగా చర్యలు చేపట్టేలా చూడాలన్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe