...
...
Next Story

Andhra Pradesh Covid Cases : ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు - కొత్తగా 10 నమోదు, 49కి చేరిన సంఖ్య

Andhra Pradesh Covid Cases : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కొత్త కేసులు నమోదవుతున్నాయి. శనివారం మరో 10 మందికి కోవిడ్ నిర్ధారణ కావడంతో మొత్తం కేసుల సంఖ్య 49కి చేరింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్య శాఖ సూచించింది.

Published on: Jul 26, 2026, 11:19:09 IST
Advertisement

Andhra Pradesh Covid Cases : ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ వేగం పుంజుకుంటోంది. గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టినట్లు కనిపించిన వైరస్ పాజిటివ్ కేసులు.… ఇప్పుడు క్రమంగా పెరుగుతుండటంతో ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. శనివారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 10 కోవిడ్-19 కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 49కి చేరుకుంది. కాగా… ఇప్పటివరకు వైరస్ బారినపడి నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

ఏపీలో కరోనా కేసులు
ఏపీలో కరోనా కేసులు

తాజాగా వెలుగుచూసిన 10 కేసుల్లో గుంటూరు జిల్లాలో గరిష్టంగా మూడు కేసులు బయటపడగా, ఎన్టీఆర్ జిల్లాలో రెండు కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇక అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, తిరుపతి మరియు విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున కొత్త కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ స్పష్టం చేసింది.

జిల్లాల వారీగా కేసుల వివరాలు

రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మొత్తం 49 కేసులను పరిశీలిస్తే…. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 11 మంది కొవిడ్ బారినపడ్డారు. దీని తర్వాత గుంటూరు జిల్లాలో 9 కేసులు, వైఎస్సార్ కడప జిల్లాలో 8 కేసులు, విశాఖపట్నం జిల్లాలో 5 కేసులు నమోదయ్యాయి. అలాగే ఎన్టీఆర్ జిల్లాలో మూడు, కాకినాడ, ఏలూరు మరియు బాపట్ల జిల్లాల్లో రెండేసి చొప్పున కేసులు నిర్ధారణ అయినట్లు అధికారులు వెల్లడించారు.

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వ్యాధి బారినపడిన వారిలో 24 మంది వివిధ ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నారు. మరో 16 మంది రోగులు హోం ఐసోలేషన్‌లో ఉంటూ, వైద్యుల నిరంతర పర్యవేక్షణలో తమ ఇళ్లలోనే కోలుకుంటున్నారు. వైరస్ బారినపడిన వారిలో ఇప్పటివరకు ఐదుగురు పూర్తిస్థాయిలో కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ఆరోగ్య శాఖ యంత్రాంగం అప్రమత్తమైంది. పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తూ… అన్ని జిల్లాల్లో పర్యవేక్షణను మరింత తీవ్రతరం చేశారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆసుపత్రుల్లో ప్రత్యేక బెడ్లను, ఆక్సిజన్ నిల్వలను మరియు అవసరమైన మందులను సిద్ధం చేసినట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు కూడా భయాందోళనలకు గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, మాస్కులు ధరించడం మరియు చేతులు శుభ్రం చేసుకోవడం వంటి నియమాలను పాటించాలని సూచించారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe