ఏపీలో అతిపెద్ద గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ - ప్రత్యేకతలెన్నో…!
ఏపీలో అతిపెద్ద గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ కు శంకుస్థాపన జరగనుంది. కాకినాడలో 495 ఎకరాలలో ఈ ప్రాజెక్ట్ ను పూర్తి చేయనున్నారు. ఏడాదికి మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి చేయటమే లక్ష్యంగా ఈ ప్రాజెక్ట్ కొలువుదీరనుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం క్లీన్ ఎనర్జీ రంగంలో సరికొత్త చరిత్రను సృష్టించబోతోంది. గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత గ్రీన్ అమోనియా పరిశ్రమ ఏర్పాటుతో దేశంలోనే అతిపెద్ద పర్యావరణహిత పరిశ్రమలలో ఒకటిగా నిలిచి చారిత్రాత్మక అడుగు వేయనుంది. గత ఏడాది గ్రీన్కో గ్రూప్కు చెందిన ఏఎమ్ గ్రీన్ సంస్థకు ఏడాదికి 1 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ అమోనియా ఉత్పత్తి చేసే ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఏడాదిలోనే ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చనుంది.

ఈ పరిశ్రమకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ ఉదయం కాకినాడలో శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 10.30 గంటలకు ముఖ్యమంత్రి అమరావతి నుంచి కాకినాడకు చేరుకుంటారు. 11.20 గంటలకు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు.
గ్రీన్ అమోనియా ప్రాజెక్టు ప్రత్యేకతలివే…
- గ్రీన్ హైడ్రోజన్ను ఉపయోగించి పూర్తిగా పునరుత్పాదక శక్తితో తయారయ్యే కార్బన్ ఉద్గారాలు లేకుండా గ్రీన్ అమోనియాను ఏఎమ్ గ్రీన్ సంస్థ ఉత్పత్తి చేయనుంది.
- బొగ్గు, చమురు, సహజ వాయువులతో తయారయ్యే గ్రే, బ్లూ అమోనియాకు భిన్నంగా ఈ ఉత్పత్తి జరుగుతుంది.
- ప్రపంచం మొత్తం డీకార్బనైజేషన్, నెట్-జీరో ఎమిషన్స్ లక్ష్యాల వైపు అడుగులు వేస్తున్న తరుణంలో గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా భవిష్యత్ ఇంధనాలుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో కాకినాడలో ఏఎమ్ గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ దేశానికే గర్వకారణంగా నిలవనుంది.
- నాగార్జున ఫెర్టిలైజర్స్ కెమికల్స్ లిమిటెడ్ పాత గ్రే అమోనియా ప్లాంట్ను గ్రీన్ ప్లాంట్గా అభివృద్ధి చేస్తున్నారు.
- 495 ఎకరాల్లో రూ.13 వేల కోట్ల పెట్టుబడితో ఏఎమ్ గ్రీన్ సంస్థ ఈ ప్లాంట్ ఏర్పాటు చేస్తోంది.
- ఈ ప్రాజెక్టును 3 దశల్లో పూర్తి చేయనున్నారు. తొలిదశలో 2027 చివరి నాటికి ఏడాదికి 0.5 టన్నుల అమ్మోనియాను ఉత్పత్తి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. తొలిదశలో రూ.18 వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు.
- రెండో దశలో 2028 నాటికి టన్ను, మూడో దశలో 1.5 టన్నుల అమ్మోనియా ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నారు. అన్ని దశల్లోనూ గ్రీన్ ఎనర్జీని మాత్రమే వినియోగించుకునే ఏకైక ఇంటిగ్రేటెడ్ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు దేశంలో ఇదేనని అధికారులు చెబుతున్నారు.
- ఈ ప్లాంట్ ఏర్పాటు ద్వారా సుమారు 2,600 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి.
ఏఎమ్ గ్రీన్ అమోనియా ప్లాంట్ కాకినాడ పోర్ట్కు కేవలం 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. గ్రీన్ అమోనియాను అవసరమైన ప్రపంచ దేశాలకు ఎగుమతులకు అద్భుత అవకాశం ఉండనుంది. ఏఎమ్ గ్రీన్ సంస్థ ఇప్పటికే జర్మనీకి చెందిన యూనిపర్ ఎస్ఈతో ఒప్పందం కుదుర్చుకుంది.
2028 నుంచి ఏడాదికి 125 కేటీపీఏ గ్రీన్ అమోనియాను ఆ దేశానికి ఎగుమతి చేయనుంది. అలాగే మలేషియాకు చెందిన పెట్రోనాస్, సింగపూర్కు చెందిన జీఐసీ, యూఏఈకి చెందిన ఏడీఏఐ వంటి సంస్థల సహకారంతో ఏర్పాటు చేస్తోన్న ఈ ప్రాజెక్ట్ ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందనుంది. ఈ ప్రాజెక్టుతో పాటే కాకినాడలోనే రూ.2,000 కోట్ల వ్యయంతో 2 గిగావాట్ల ఎలక్ట్రోలైజర్ తయారీ యూనిట్ను కూడా ఏఎమ్ గ్రీన్ ఏర్పాటు చేస్తోంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

