ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మూడు రోజుల యూఏఈ పర్యటనకు బయలుదేరారు. ఉదయం అమరావతి నుంచి హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లారు. అక్కడి నుంచి 10 గంటలకు యూఏఈకు బయలుదేరుతారు.

విశాఖలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న భాగస్వామ్య సదస్సుకు దేశ విదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ ప్రతినిధుల్ని ఆహ్వానిస్తోంది. దీంట్లో భాగంగా యూఏఈలో పర్యటించే ముఖ్యమంత్రి మూడు రోజుల పాటు వివిధ పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతారు.
తొలిరోజు పర్యటన ఇలా…..
తొలిరోజు పర్యటనలో భాగంగా 22వ తేదీన ఐదు కంపెనీలకు చెందిన పారిశ్రామికవేత్తలతో సీఎం భేటీ కానున్నారు. శోభా గ్రూప్, షరాఫ్ డీజీ, ట్రాన్స్ వరల్డ్ గ్రూప్, లూధా గ్రూప్, దుబాయ్ ఫ్యూచర్ ఫౌండేషన్ సంస్థలకు చెందిన ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశం అవుతారు. వీరితో వన్ టు వన్ సమావేశాలు నిర్వహిస్తారు. వీరితో జరిపే వేర్వేరు భేటీల్లో ఇండస్ట్రీయల్, ఐటీ పార్కులు, లాజిస్టిక్స్, వేర్ హౌసింగ్ సదుపాయాలు, పోర్టులు-షిప్ మేనేజ్మెంట్ వంటి రంగాల్లో పెట్టుబడులపై ఆయా సంస్థల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు చర్చించనున్నారు.
తొలి రోజు పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు…. బృందం పలు ప్రాంతాలను సందర్శించనుంది. మ్యూజియం సందర్శనలో భాగంగా జర్నీ టూ 2071 థీమ్ తో ఉండే స్పేస్ ట్రావెల్ ఎక్స్ పీరియన్స్ సెంటర్ ను సీఎం పరిశీలిస్తారు. అలాగే ఇదే మ్యూజియంలో ఏర్పాటు చేసిన భవిష్యత్ టెక్నాలజీ సొల్యూషన్స్ అనే అంశంపైనా సీఎం అధ్యయనం చేయనున్నారు. ఇక రాత్రికి సీఐఐ భాగస్వామ్య సదస్సుకు సంబంధించిన రోడ్ షోకు ముఖ్యమంత్రి హాజరుకానున్నారు.
ఈ రోడ్ షోలో పాల్గొని వివిధ పరిశ్రమల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరనున్నారు. అలాగే విశాఖలో వచ్చే నెల 14,15వ తేదీల్లో జరగబోయే పెట్టుబడుల సదస్సుకు ఆహ్వానించనున్నారు. పర్యటన చివరి రోజున దుబాయ్లో ఏపీ ఎన్ఆర్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న తెలుగు డయాస్పోరా సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. చంద్రబాబుతో పాటు మంత్రులు టీజీ భరత్, బీసీ జనార్థన్ రెడ్డి, సీఎం సెక్రటరీ కార్తికేయ మిశ్రా, ఇండస్ట్రీస్ సెక్రటరీ యువరాజ్, ఏపీ ఇడిబి సీఈఓ సాయికాంత్ వర్మ, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సీఈఓ ధాత్రిరెడ్డి దుబాయ్ పర్యటనలో పాల్గొననున్నారు.