ఏఐకి చిరునామాగా ఏపీని మార్చుతాం - సీఎం చంద్రబాబు

ఏఐకి చిరునామాగా ఏపీని మార్చుతామని సీఎం చంద్రబాబు అన్నారు. పున్నమి ఘాట్‌లో నిర్వహించిన దీపావళి వేడుకల్లో పాల్గొన్న ఆయన…సుస్థిర పాలనతోనే అభివృద్ధి సాధ్యమని వ్యాఖ్యానించారు. జీఎస్టీ సంస్కరణలతో ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ. 15 వేలు ఆదా అవుతుందని చెప్పారు.

Published on: Oct 20, 2025, 09:17:50 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

విశాఖపట్నానికి గూగుల్ ఏఐ డాటా సెంటర్ రావడాన్ని జీర్ణించుకోలేని కొందరు మూర్ఖులు రాజకీయ కక్షతో అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని, అటువంటి వారి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖలో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో గూగుల్ ఏర్పాటు వల్ల 12 దేశాలకు సేవలు అందుతాయన్నారు. గూగుల్ సంస్థ అమెరికా వెలుపల, విదేశాల్లో పెడుతున్న అతి పెద్ద పెట్టుబడి కూడా ఇదే కావడం గర్వకారణమన్నారు.

సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబు

ఏఐకి చిరునామాగా ఏపీ - సీఎం చంద్రబాబు

హైదరాబాద్‌ అభివృద్ధి వల్ల దేశంలో అత్యధిక తలసరి ఆదాయం అక్కడి నుంచే వస్తోందని… ఇప్పుడు ఏపీలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి అన్నారు. ఏపీని ఏఐకి చిరునామాగా మారుస్తామని స్పష్టం చేశారు. ఏఐ వల్ల రాబోయే పదేళ్లలో ఊహించని అభివృద్ధి రాష్ట్రంలో జరగుతుందని సీఎం చంద్రబాబు చెప్పారు.

ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త తయారుకావాలని... ప్రపంచంలోనే తెలివైన వారికి చిరునామాగా ఏపీ ఉంటుందని తెలిపారు. విజయవాడ పున్నమి ఘాట్‌లో సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన దీపావళి వేడుకల్లో సతీసమేతంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. అనాథ పిల్లలతో కలిసి క్రాకర్ షోను వీక్షించారు. అనంతరం సభను ఉద్దేశించి సీఎం చంద్రబాబు ప్రసంగించారు.

“రాష్ట్రంలో మళ్లీ వైకుంఠపాళి వద్దు. డబుల్ ఇంజన్ సర్కారుతో అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి, సంక్షేమం అందుతోంది. 2019-24 మధ్య ప్రజలెవరూ సంతోషంగా పండుగలే జరుపుకోలేదు. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక ప్రజలంతా సుఖంగా ఉన్నారు. జీఎస్టీ సంస్కరణల ఉత్సవాలు దసరాతో ప్రారంభించి దీపావళి వరకూ నిర్వహిస్తున్నాం. సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ వల్ల ప్రజలకు ఎంతో మేలు జరుగుతోంది. జీఎస్టీ వల్ల ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ.15 వేలు ఆదా అవుతోంది” అని సీఎం చంద్రబాబు చెప్పారు.

‘15 నెలల్లో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాం. తల్లికి వందనం, పింఛన్లు, స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం, దీపం 2 , అన్న క్యాంటీన్లు, అన్నదాత సుఖీభవ, ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం వంటి హామీలన్నీ అమలు చేశాం. ఎన్ని ఇబ్బందులున్నా ఉద్యోగులకు దీపావళి సందర్భంగా ఒక డీఏ ఇవ్వాలని నిర్ణయించాం. పోలీస్ సోదరులకు ఒక సరెండర్ లీవ్ ఇస్తున్నాం. ఆర్టీసీ ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తున్నాం. 4వ తరగతి ఉద్యోగుల గౌరవం పెంచేలా రీ డిజిగ్నేట్ చేస్తాం. ఉద్యోగుల హెల్త్ కార్డుల సమస్య సహా ఇతర సమస్యలను కూడా పరిష్కరిస్తున్నాం. 2047 నాటికి దేశంలోనే ఏపీ నెంబర్ వన్‌గా నిలుస్తుంది ’అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

బీసెంట్ రోడ్డులో సీఎం…

దీపావళీ వేడుకలకు హజరయ్యే ముందు బీసెంట్ రోడ్డులో సీఎం చంద్రబాబు పర్యటించారు. పలువురు చిరు, వీధి వ్యాపారులు, జనరల్ స్టోర్, చెప్పుల షాపు నిర్వాహకులతో మాట్లాడారు. జీఎస్టీ తగ్గింపు కారణంగా వస్తువుల ధరల తగ్గుదలను గురించి ఆయా వర్గాల వారిని అడిగి తెలుసుకున్నారు. చింతలపూడి దుర్గారావు అనే వీధి వ్యాపారితో సీఎం చంద్రబాబు మాట్లాడారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More