AP EAPCET 2025 : బైపీసీ స్ట్రీమ్ కౌన్సెలింగ్ అప్డేట్ - వెబ్ ఆప్షన్లకు మరికొన్ని గంటలే గడువు, సీట్ల కేటాయింపు ఎప్పుడంటే?
ఏపీ ఈఏపీసెట్ బైపీసీ స్ట్రీమ్ ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే రిజిస్ట్రేషన్ల పూర్తి కాగా... ప్రస్తుతం వెబ్ ఆప్షన్లు జరుగుతున్నాయి. ఈ గడువు ఇవాళ్టితో పూర్తవుతుంది. అక్టోబర్ 21వ తేదీన మొదటి విడత సీట్లను కేటాయిస్తారు.
ఏపీ ఈఏపీసెట్ బైపీసీ స్ట్రీమ్ మొదటి విడత కౌన్సెలింగ్ కొనసాగుతోంది. ఎంట్రెన్స్ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులు…. ఇప్పటికే రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. వీరి ధ్రువపత్రాల పరిశీలన కూడా పూర్తి అయింది. ఇక ప్రస్తుతం వీరంతా వెబ్ ఆప్షన్లను ఎంచుకుంటున్నారు. అయితే ఈ గడువు ఇవాళ్టితో(అక్టోబర్ 17) పూర్తి కానుంది. అర్హులైన విద్యార్థులు వెంటనే ఈ ప్రాసెస్ పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ ప్రాసెస్ పూర్తి చేసుకున్న వారికే సీట్ల కేటాయింపు ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.
ఏపీఈఏపీసెట్ 2025 బైపీసీ స్ట్రీమ్ కౌన్సెలింగ్
ఇందులో భాగంగా అగ్రికల్చర్ అండ్ ఫార్మా విభాగం పరీక్ష రాసిన ఇంటర్ బైపీసీ విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించి సీట్లను కేటాయిస్తారు. మొత్తం 2 విడతల్లో సీట్ల భర్తీని పూర్తి చేస్తారు. ఇందులో బీ ఫార్మసీ, ఫార్మా డి, బీటెక్ బయోటెక్నాలజీ, పుడ్ టెక్నాలజీ, బయో మెడికల్ ఇంజినీరింగ్, ఫార్మాస్యూటికల్ ఇంజినీరింగ్ కోర్సులున్నాయి. విద్యార్థులు సాధించిన ర్యాంకుల ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుంది.
సీట్ల కేటాయింపు ఎప్పుడంటే...?
వెబ్ ఆప్షన్లు పూర్తి చేసుకున్న వారు ఈనెల 18వ తేదీన ఎడిట్ చేసుకునే వీలుంటుంది. ఈనెల 21వ తేదీన సీట్ల కేటాయిస్తారు. ఇక సీట్లు పొందిన విద్యార్థులు ఈనెల 24లోపు కాలేజీల్లో రిపోర్టింగ్ చేసుకోవాలి. మరోవైపు ఈనెల 21వ తేదీ నుంచి ఫస్ట్ సెమిస్టర్ తరగతులు ప్రారంభమవుతాయని అధికారులు ఓ ప్రకటన ద్వారా తెలిపారు.
ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ తేదీలు:
ఇక ఈఏపీసెట్ బైపీసీ స్ట్రీమ్ ఫైనల్ ఫేజ్ ప్రక్రియ ఈనెల 25వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లకు ఈనెల 29 వరకు అవకాశం ఉంటుంది. పూర్తి వివరాలను https://eapcet-sche.aptonline.in/EAPCETAGR/ వెబ్ సైట్ లో చూడొచ్చు. రిజిస్ట్రేషన్ తో పాటు ప్రాసెస్ ఫీజు కూడా చెల్లించుకోవచ్చు.